హైదరాబాద్: గత కొన్ని నెలలుగా అత్యుత్తమ ఫామ్లో కొనసాగుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించి నాలుగు టెస్టుల్లో వరుసగా నాలుగు డబుల్ సెంచరీలు సాధించిన క్రికెటర్గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
తాజాగా విరాట్ కోహ్లీ మరో రికార్డుని బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. అది కూడా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డు. టెస్టు బ్యాటింగ్లో అత్యధిక రేటింగ్ పాయింట్ కలిగిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ప్రస్తుతం 895 పాయింట్లతో ఆండీ ఫ్లవర్తో కలిసి 33వ స్థానంలో ఉన్నాడు.
ఈ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్మన్ 961 రేటింగ్ పాయింట్లతో మొట్టమొదటి స్ధానంలో ఉన్నాడు. ఇక సచిన్ టెండూల్కర్ 898 రేటింగ్ పాయింట్లతో 31వ స్ధానంలో ఉన్నాడు. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో విరాట్ కోహ్లీ గనుక తన ఫామ్ని కొనసాగిస్తే సచిన్ రికార్డుని తప్పక బద్దలు కొడతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత ఆటగాళ్లలో సునీల్ గవాస్కర్ 916 రేటింగ్ పాయింట్లతో ముందు వరుసలో ఉన్నాడు.