హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు. హైదరాబాద్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న ఏకైక టెస్టులో కోహ్లీ ఈ రికార్డుని సాధించే అవకాశం ఉంది. బంగ్లాతో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్లో కోహ్లీ సేన విజయం సాధిస్తే టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ రికార్డుని కోహ్లీ అధిగమిస్తాడు.
ప్రస్తుతం ఈ ఇద్దరూ కెప్టెన్లుగా టీమిండియాకు 14 టెస్టు విజయాలను అందించిన సమంగా ఉన్నారు. 27 టెస్టు విజయాలతో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మొట్టమొదటి స్ధానంలో నిలవగా, 21 టెస్టు విజయాలతో సౌరభ్ గంగూలీ రెండో స్ధానంలో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత 14 టెస్టు విజయాలతో అజహరుద్దీన్, కోహ్లీలు ఉన్నారు.
ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్న కోహ్లీ సేన బంగ్లాదేశ్పై అలవోక విజయాన్ని సాధిస్తుందనడంలో ఎటువంటి సందేహాం లేదు. ఈ క్రమంలో బంగ్లాతో ఏకైక టెస్టులో అజహరుద్దీన్ రికార్డుని కోహ్లీ అధిగమించే అవకాశం ఉంది. ఇప్పటివరకు వరుసగా ఐదు టెస్టు విజయాలను కోహ్లీ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.
ధోని నుంచి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కోహ్లీ 2015లో తొలిసారి శ్రీలంకపై 2-1తో సిరిస్ కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాపై 3-0, వెస్టిండిస్పై 2-0 (బయట), న్యూజింలాండ్పై 3-0తో విజయం సాధించాడు. ఇటీవలే ఇంగ్లాండ్తో ముగిసిన టెస్టు సిరిస్లో కూడా కోహ్లీ సేన నెగ్గిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడేందుకు భారత్ పర్యటనకు వచ్చింది. 2000లో టెస్టు అరగేట్రం చేసిన తర్వాత ఒక్కసారి కూడా భారత్పై విజయం సాధించలేదు. ప్రస్తుతం టెస్టు ర్యాంకుల్లో టీమిండియా నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతుండగా, బంగ్లాదేశ్ 9వ స్ధానంలో కొనసాగుతోంది.
హైదరాబాద్ టెస్టులో నెగ్గితే బంగ్లాకు 5 పాయింట్లు వస్తాయి. భారత 120 నుంచి 118 పాయింట్లకు పడిపోనుంది. భారత నెగ్గితే ఒకే పాయింట్ లభిస్తుంది. బంగ్లాతో ఏకైక టెస్టు మ్యాచ్ సందర్భంగా మంగళవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో కుంబ్లే మాట్లాడుతూ బంగ్లాను తేలిగ్గా తీసుకోబోమని స్పష్టం చేశాడు.
Most Test wins as India captain (Top 5):
27 (60 matches) - MS Dhoni
21 (49) - Sourav Ganguly
14 each - Virat Kohli (22), Mohammad Azharuddin (47)
9 each - Sunil Gavaskar (47), Mansur Ali Khan Pataudi (40)
8 (25) - Rahul Dravid