హైదరాబాద్: పాకిస్ధాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్కు స్ధానిక కోర్టు అరెస్ట్ వారెంట్ని జారీ చేసింది. వరుసగా వాయిదాలకు గైర్హాజరు అవుతుండడంతో స్ధానిక కోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. వివరాల్లోకి వెళితే రెండు సంవత్సరాల క్రితం తన కారుపై కాల్పులు జరిపిన ఘటనలో అక్రమ్ స్వయంగా మేజర్ (రిటైర్డ్) అమినుర్ రహ్మాన్పై కేసు పెట్టాడు.
ఈ కేసుకు సంబంధించి గత 31 వాయిదాలు జరిగిన అక్రమ్ కోర్టుకు రాలేదు. దీంతో ఈ నెల 17న జరిగే హియరింగ్కు అక్రమ్ను హాజరుపరచాల్సిందిగా పోలీసులను ఆదేశిస్తూ కోర్టు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను జారీ చేసినట్లు పాకిస్థాన్ పత్రిక డాన్ పేర్కొంది.
2016, ఆగస్టు 6న కరాచీలోని నేషనల్ స్టేడియంలో యువ బౌలర్ల ప్రాక్టీస్ సెషన్కు హాజరై వస్తుండగా కరాచీలోని కర్సాజ్ రోడ్డులో తన మెర్సిడెస్ బెంజ్ కారు యాక్సిడెంట్కు గురైంది. దీంతో తన కారును యాక్సిడెంట్ చేసిన వారితో అక్రమ్ ఘర్షణ పడ్డాడు.
ఈ సమయంలో అందులో ప్రయాణిస్తున్న రిటైర్డ్ మేజర్ అమినుర్ రహ్మాన్ బాడీగార్డ్ వసీం కారుపై కాల్పులు జరిపాడు. దీనిపై అక్రమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అమినుర్ రహ్మాన్ తనని పోలీసులు అరెస్ట్ చేయకుండా కోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు.
అనంతరం ఈ కేసుకు సంబంధించి ఇరు వర్గాలు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకున్నట్టు సమాచారం. అయితే అక్రమ్ కోర్టుకు హాజరై తన వాంగ్మూలాన్ని రికార్డు చేయకపోవడంతో స్ధానిక కోర్టు అరెస్ట్ వారెంట్ని జారీ చేసింది.