మీర్పూర్ :ధోనీ సేన ఆసియా కప్ ట్వంటీ 20 పోరులో శుభారంభం చేసింది. ఆతిథ్య బంగ్లాదేశ్ను పేస్తో దెబ్బతీసింది. పేసర్లు విజృంభించడంతో బుధవారం 45 పరుగులతో విజయం సాధించింది. జట్టు విజయంలో కీలకపాత్ర బ్యాట్స్మెన్దే.
సగం ఇన్నింగ్స్ ముగిసేసరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 53 పరుగులే చేసింది. జట్టు ఎదురీదుతున్న సమయంలో రోహిత్ శర్మ (83, 55 బంతుల్లో 7×4, 3×6) రెచ్చిపోయాడు. హార్ధిక్ పాండ్య (31, 18 బంతుల్లో 4×4, 1×6) మెరుపులు తోడవడంతో భారత్ స్కోరు దూసుకెళ్లింది.
చివరి పది ఓవర్లలో 114 చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. నెహ్రా (3/23), బుమ్రా (1/23), పాండ్య (1/23) విజృంభించడంతో బంగ్లా 7 వికెట్లకు 121 పరుగులే చేసింది. భారత్ శనివారం పాకిస్థాన్ను ఢీకొంటుంది.
లక్ష్యఛేదనలో బంగ్లా ఏ దశలోనూ ధోనీసేనను ధీటుగా ఎదర్కోలేదు. వరుసగా రెండు సిరీస్ల్లో అదరగొట్టిన నెహ్రా, బుమ్రాల పేస్ ద్వయం మరోసారి ఆకట్టుకుంది. ఓపెనర్ మిథున్ (1)ను నెహ్రా ఔట్ చేయగా మరో ఓపెనర్ సౌమ్య సర్కార్ (11)ను బుమ్రా వెనక్కి పంపాడు.
ఆ తర్వాత పాండ్య, అశ్విన్లు ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి మ్యాచ్ను ఏకపక్షం చేసేశారు. బంగ్లా కూడా పది ఓవర్లలో 51/3తో భారత్ను తలపించింది. అయితే రోహిత్లా ఆ జట్టులో ఎవరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. షబ్బీర్ రెహమాన్ (44) ఒంటరి పోరాటం చేశాడు.
17వ ఓవర్లో నెహ్ర వరుస బంతుల్లో మహ్మదుల్లా (7), మొర్తజా (0)లను పెవిలియన్కు పంపి బంగ్లాకు ఓటమి ఖాయం చేశాడు. ఆ జట్టు మొత్తం 7 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ కూడా తొలుత తడబడింది.
శిఖర్ ధావన్ (2) రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. కోహ్లి (8) కూడా క్రీజులో తడబడ్డాడు. రైనా (13) కూడా అనవసర షాట్కు యత్నించి మహ్మదుల్లా బౌలింగ్లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రోహిత్ ఆటను మార్చేశాడు. 21 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న అతడు తర్వాత చెలరేగిపోయాడు. 229.62 స్ట్రైక్రేట్తో పరుగులు సాధించాడు.