ఢాకా: ఆసియా కప్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వెళ్లిన భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గాయాలపాలయ్యాడు. టోర్నమెంట్లో భాగంగా సోమవారం నిర్వహించిన ట్రైనింగ్ సెషన్లో ధోని వీపు వెనుక భాగాన ఉన్న కండరాలు పట్టుకపోయాయి.
ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సోమవారం సాయంత్రం ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సోమవారం మధ్యాహ్నాం నిర్వహించిన ట్రైనింగ్ సెషన్లో ధోని గాయపడినట్లు పేర్కొంది. ధోని స్థానంలో వికెట్ కీపర్, బ్యాట్స్మెన్గా రాణిస్తున్న పార్ధీవ్ పటేల్ను తుది జట్టులోకి ఎంపిక చేశారు.
ఆసియా కప్ టోర్నమెంట్లో భాగంగా తొలి మ్యాచ్లో బుధవారం నాడు భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఆస్ట్రేలియాతో ఆడిన మూడు ట్వంటీల సిరీస్ను ధోనీ సేన క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మూడు ట్వంటీ20ల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ట్వంటీ20 క్రికెట్లో టీమిండియా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.