మీర్పూర్: తాను గతంలో ఆడినట్లుగా మళ్లీ ఆడుతున్నానని, 'మై గేమ్ ఈజ్ బ్యాక్' అని యువరాజ్ సింగ్ చెప్పాడు. దాదాపు రెండేళ్ల క్రితం.. 2014లో ఇదే వేదిక పైన ఐసీసీ ట్వంటీ 20 ప్రపంచ కప్లో యువరాజ్ ఆడేందుకు ఇబ్బందులు పడ్డాడు.
అయితే, ఈసారి మాత్రం యువరాజ్ సింగ్ బాగా ఆడాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచులో యువీ 18 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స్లతో 35 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్కు యువీ దూకుడు జత కలవడంతో ఆసియా కప్లో భారత్ హ్యాట్రిక్ విజయంతో ఫైనల్కు దూసుకెళ్లింది.
2014 ఏప్రిల్లో జరిగిన మ్యాచులో శ్రీలంక పైన యువరాజ్ 21 బంతులు ఆడి కేవలం 11 పరుగులే చేశాడు. దీంతో అప్పుడు అభిమానులు అతని పైన మండిపడ్డారు. దుమ్మెత్తి పోశారు. యువరాజ్ టీమిండియా విలన్ అంటూ ఆగ్రహించారు.
తాజాగా, అదే శ్రీలంక, అదే వేదిక పైన ఇప్పుడు యువరాజ్ రెచ్చిపోయాడు. గెలుపులో కీలక పాత్ర పోషించాడు. కీలక సమయంలో యువరాజ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీనిపై యువరాజ్ స్పందించాడు.
తాను గతంలో ఆడినట్లుగా ఆడానని చెప్పాడు. తన గత ఫాం తనకు వచ్చిందని చెప్పాడు. నా ఆట తీరు తిరిగి వచ్చిందని చెప్పాడు.
కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా యువరాజ్ సింగ్ బ్యాటింగ్ తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. యువరాజ్ తన ఫాం అందుకున్నాడని చెప్పారు.
మంచి షాట్కు ముందు రెండు మూడు బంతులు వదిలేశాడని, బాగా ఆడాడని చెప్పాడు. ఇలాగే ఆడితే ప్రపంచకప్కు ముందు మంచి విషయమని చెప్పాడు. యువీ ఇన్నింగ్స్ చాలా కీలకమని, ఈ మ్యాచ్ గురించి అని చెప్పడం లేదని, మొత్తంగా అతడు ఫామ్లోకి రావడం జట్టుకు శుభపరిణామమన్నాడు.