న్యూఢిల్లీ : టీమ్ ఇండియా కోచ్ పదవి కోసం చేపట్టిన ఇంటర్వ్యూల్లో భాగంగా.. ఇంటర్వ్యూ కోసం హాజరైన టీమ్ ఇండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి ఆ సమయంలో గంగూలీ వ్యవహరించిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
ప్రముఖ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా గంగూలీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన రవిశాస్త్రి.. 'అసలు గంగూలీకి తనతో వచ్చిన సమస్యేంటో అర్థం కావడం లేదని' పేర్కొన్నాడు. ఇంటర్వ్యూ సందర్భంగా గంగూలీతో ఏమైనా సమస్యను ఎదుర్కొన్నారా..? అన్న ప్రశ్నకు బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు రవిశాస్త్రి.
కాగా, టీమ్ ఇండియా కోచ్ పదవి కోసం అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, గంగూలీ, సచిన్ టెండూల్కర్ సభ్యులుగా ఉండగా.. రవిశాస్త్రి ఇంటర్వ్యూకు హాజరైన సమయంలో గంగూలీ అక్కడ లేకపోవడం చర్చలకు తావిచ్చింది.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'తానేమి సీఈవో జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లలేదని, అసలు తనను గంగూలీ ఎందుకు ఇంటర్వ్యూ చేయొద్దనుకున్నాడో మీరే అడగాలంటూ..!' అసహనం వ్యక్తం చేశాడు. కమిటీలో మిగతా సభ్యులు వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, సంజయ్ జగ్దాలేతో మాత్రం సానుకూల వాతావరణంలో చర్చలు జరిపినట్టు తెలిపాడు.
ఇంటర్వ్యూలో భాగంగా టీమ్ డైరెక్డర్ గా ఉన్నప్పుడు తాను సాధించిన ఫలితాల గురించి అడ్వైజరీ కమిటీకి వివరించినట్టు చెప్పుకొచ్చాడు రవిశాస్త్రి. ముఖ్యంగా టీమ్ ఇండియా విదేశీ టూర్స్ లో తను నిర్వహించిన పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు వెల్లడించాడు.
ఇకపోతే.. కోచ్ గా ఎంపిక కానందుకు బాధపడుతున్నారా..? అన్న ప్రశ్నకు 'తన బాధంతా ఒక్కరోజుకే పరిమితమని, ఇంటర్వ్యూ జరిగి వారం గడిచిందని, తానిప్పుడు దాని గురించి మరిచిపోయానని' చెప్పాడు. అలాగే జట్టు డైరెక్టర్ గా బీసీసీఐ మీ పదవి కాలాన్ని పొడగించకపోవడం వల్లే టీమ్ ఇండియాకు ఇప్పుడు కోచ్ ను వెతకాల్సిన పని పడింది కదా..! అని మీడియా ప్రశ్నించగా.. 'అది బీసీసీఐ తలనొప్పి, నాకు సంబంధం లేదు' అంటూ ముగించేశాడు.
ఇక ఇంటర్వ్యూ పారదర్శకంగా జరిగిందా..! లేదా..! అన్నది కూడా తనకు అనవసరమని, తన పని ఇంటర్వ్యూ ఇవ్వడం మాత్రమేనని లోపల ఏం జరిగిందో తనకు తెలియదన్నాడు.