హైదరాబాద్: ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసే వరకు కూడా ఎర్ర బంతితో ఏం ఆడతారో తెలియదని టీమిండియా ప్రధాన పేసర్లలలో ఒకడైన ఉమేశ్ యాదవ్ అన్నాడు. ఉమేశ్ యాదవ్కి 20 ఏళ్ల వయసు వచ్చేవరకు ఆ బంతిని ఉపయోగించనే లేదని పేర్కొన్నాడు.
అప్పటివరకు తాను రబ్బరు, టెన్నిస్ బంతులతోనే మ్యాచ్లు ఆడేవాడినని అన్నాడు. ఫస్ట్ క్లాస్లోకి అరంగేట్రం చేసిన తర్వాత టెస్టు క్రికెట్ ఆడే ఎర్ర బంతితో ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయినట్లు ఉమేశ్ యాదవ్ తెలిపాడు.
'చిన్నతనం నుంచి క్రికెట్ ఆడుతుంటే చాలా విషయాలు తెలుస్తాయి. కానీ కొన్నిసార్లు మనం ఏదైనా భిన్నంగా చేయాల్సి వచ్చినపుడు సముద్రంలో ఉన్నట్లు ఉంటుంది' అని బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో ఉమేశ్ యాదవ్ పేర్కొన్నాడు.
'నేను 20 ఏళ్ల వయసు వరకు టెన్నిస్, రబ్బరు బంతులతోనే ఆడాను. ఓ ఫాస్ట్ బౌలర్ విషయంలో అప్పటికి చాలా ఆలస్యమైనట్లు. నాకు లెదర్ బంతి ఇచ్చేటప్పటికి దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ బంతిని ఎక్కడ పిచ్ చేయాలో నాకు రెండేళ్ల పాటు అవగాహన రాలేదు' అని యాదవ్ అన్నాడు.
'బంతి ఎలా వెళ్తుందో కూడా తెలిసేది కాదు. ఆ సమయంలో కోచ్లు నాకు సాయం చేశారు. బంతిపై నియంత్రణ సులువేనని తెలియ చేశారు. ఇక అప్పట్నుంచి నా బౌలింగ్ శైలి మీద దృష్టిపెట్టా. నా వేగం నన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తుందని నాకు తెలుసు. వేగంగా బౌలింగ్ చేయడం నాకెప్పుడూ ఇష్టం' అని ఉమేశ్ యాదవ్ అన్నాడు.
ఏడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఉమేశ్ యాదవ్ ప్రస్తుతం భారత జట్టు తరుపున ప్రీమియం బౌలర్గా కొనసాగుతున్నాడు. భారత్ తరుపున ఇప్పటి వరకు 33 టెస్టులు, 70 వన్డేలు ఆడాడు. గత ఏడాదిగా ఉమేశ్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.