హైదరాబాద్: ఫిబ్రవరిలో భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆ దిశగా తన ప్రణాళికలను సిద్దం చేసింది. భారత్లో భారత్ను ఓడించాలనే ఉద్దేశంతో అందుకు తగిన మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ మాజీ స్ఫిన్నర్ మాంటే పనేసర్ను స్పిన్ బౌలింగ్ కన్సల్టెంట్గా క్రికెట్ ఆస్ట్రేలియా నియమించింది.
34 ఏళ్ల పనేసర్ 2012-13 సీజన్లో భారత్పై సిరీస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ సిరీస్లో పనేసర్ 17 వికెట్లు తీసి ఇంగ్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీనిని పరిగణనలోకి తీసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా అతడిని స్పిన్ బౌలింగ్ కన్సల్టెంట్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది సమ్మర్ను సిడ్నీలో క్లబ్ క్రికెటర్గా గడిపిన పనేసర్ ఈ వారంలో ఆసీస్ జట్టుతో పనేసర్ కలిసి ఆస్ట్రేలియా స్పిన్నర్లకు సలహాలు ఇవ్వనున్నాడు. ఇక ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో స్పిన్నర్లకు పనేసర్ మెళుకువలు నేర్పనున్నట్లు ఆస్ట్రేలియా హై ఫెర్ఫార్మెన్స్ మేనేజర్ హోవార్డ్ తెలిపారు.
ఆసీస్ ప్రధాన స్పిన్నర్లు అయిన స్టీవ్ ఓ కీఫ్, మాట్ రెన్ షాలకు పనేసర్ సలహాలిస్తాడని తెలిపాడు. 'భారత్లో స్పిన్ బౌలింగ్ పై పనేసర్కు మంచి అవగాహన ఉంది. స్పిన్ను ఆడేటప్పుడు బ్యాట్స్మెన్ ఎలా ఆలోచిస్తారు? అదే సమయంలో బౌలర్లు ఎలా బౌలింగ్ చేయాలి? అనే దానిపై పనేసర్ సేవల్ని ఉపయోగించుకోనున్నాం. పనేసర్ ఎంపిక మా జట్టుకు కలిసొస్తుందని ఆశిస్తున్నాం' అని హోవార్డ్ పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్ తరుపున పనేసర్ 50 టెస్టు మ్యాచ్లు ఆడాడు. 2013-14లో జరిగిన యాషెస్ సిరీస్లో చివరిసారిగా పాల్గొన్నాడు. ఇదిలా ఉంటే 2004 తర్వాత భారత్లో ఆస్ట్రేలియా ఒక్క టెస్టు మ్యాచ్ని కూడా గెలవలేదు. 2011లో శ్రీలంకపై ఒక టెస్టు సిరిస్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా ఉపఖండంలో తొమ్మిది టెస్టుల్లో ఆసీస్ ఓటమి పాలైంది.