హైదరాబాద్: పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా ఆరంభంలోనే ఆతిథ్య బంగ్లాదేశ్కు గట్టి షాకిచ్చింది. ఫతుల్లా వేదికగా బంగ్లాదేశ్తో మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సిన రెండు రోజుల వార్మప్ మ్యాచ్ని రద్దు చేసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది.
గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కూడా ఎడతెరపిలేని వర్షం కారణంగా ఫతుల్లా మైదానం చిత్తడిగా మారింది. ఈ క్రమంలో వార్మప్ మ్యాచ్ కోసం మరో స్టేడియాన్ని సిద్ధం చేస్తామని చివరి నిమిషంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చెప్పడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఆసీస్ జట్టు నిరాకరించింది.
'మ్యాచ్ని నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ వర్షం వారి ఆశల్ని వమ్ముచేసింది. ఢాకాలో ఆసీస్ జట్టు కోసం అన్ని సౌకర్యాలు కల్పించారు. కుండపోత వర్షం కారణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసి చాలా బాధేసింది' అని ఆసీస్ కోచ్ డారెన్ లీమన్ వెల్లడించాడు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బంగ్లాదేశ్లో ఇప్పటివరకు 115 మంది మరణించినట్లు బంగ్లాదేశ్ డిజాస్టర్ ఏజెన్సీ అధికారిక ప్రకటన చేసింది. 2006 నుంచి భద్రత కారణాలతో ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్లో పర్యటించలేదు. నిజానికి ఈ రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ అక్టోబర్ 2015లో జరగాల్సి ఉంది.
అప్పట్లో ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లా పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు రాలేదు. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా మళ్లీ తిరిగి ఇప్పుడు షెడ్యూల్ ప్రకటించింది. ఇరు జట్ల మధ్య ఆగస్టు 27 (ఆదివారం) నుంచి రెండు టెస్టుల సిరీస్లో ఆరంభంకానుంది.