హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం భారత పర్యటనకు వస్తున్న ఆస్ట్రేలియా జట్టు కొంతవరకైనా టీమిండియాకు నష్టాన్ని కలిగిస్తుందని ఆస్ట్రేలియా స్పిన్నర్ స్టీవ్ ఓ కీఫె పేర్కొన్నాడు. 35 ఏళ్ల స్టీవ్ ఇప్పటివరకు భారత్లో ఒక్క టెస్టు కూడా ఆడలేదు.
2015లో ఆస్ట్రేలియా ఏ పర్యటనకు వచ్చిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అప్పట్లో చెన్నైలో జరిగిన టెస్టులో స్టీవ్ ఓ కీఫె ఆరు వికెట్లు తీసుకున్నాడు. అందులో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కూడా ఉండటం విశేషం.
ఈ సందర్భంగా స్టీవ్ ఓ కీఫె మీడియాతో మాట్లాడాడు. 'టీమిండియా క్లాస్ టీమ్, స్వదేశంలో భారత ఆటగాళ్లు చెలరేగి ఆడతారు, వారిని ఎదుర్కొనడం పెద్ద జాబ్. టెస్టు క్రికెట్ కావడంతో టీమిండియాకు కొంతైనా నష్టాన్ని కలిగిస్తాం' అని స్టీవ్ అన్నాడు.
'ఇప్పటికే భారత్లో ఆడిన న్యూజిలాండ్కు చెందిన డానియేల్ వెటోరి, శ్రీలంకకు చెందిన రంగనా హెర్నాత్తో మాట్లాడా. అక్కడి బ్యాట్స్మెన్లు ఢిపెన్స్ ఆడతారని, ఇలాంటి సమయంలో సరైన పిచ్లో బంతులు వేసి బ్యాట్స్మెన్లను ఒత్తిడికి గురిచేయాలి' అని చెప్పారని వివరించాడు.
పుజారా, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లతో టీమిండియా అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ను కలిగి ఉందని స్టీవ్ తెలిపాడు. 2015 భారత పర్యటనలో తనతో పాటు ఆష్టన్కు భారత్లో ఆడిన అనుభవం ఉందని, దీనిని సద్వినియోగపరచుకుంటామని చెప్పాడు.