హైదరాబాద్: స్లెడ్జింగ్పై తమకు ఎలాంటి భయం లేదని స్టైలిష్ బ్యాట్స్మన్ అజ్యింకె రహానే వ్యాఖ్యానించాడు. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరిస్కు తాము పూర్తి సిద్ధంగానే ఉన్నామని రహానే అన్నాడు.
ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్ల మాటల దాడిపై తమకెలాంటి ఆందోళన లేదని, ప్రతీ ఆటగాడిని కట్టడి చేసేందుకు తమ దగ్గర పక్కా ప్రణాళికలు ఉన్నాయని, నాలుగు టెస్టుల సిరీస్లో దూకుడైన ఆటను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రహానే తెలిపాడు.
'వాళ్లు స్లెడ్జింగ్ చేస్తారో లేదో మాకు తెలీదు. ప్రతి ఒక్క ఆటగాడి కోసం కొన్ని వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ వాటిని ఇక్కడ వివరించలేను. నైపుణ్యంతో గాని, స్లెడ్జింగ్తో గాని ఏదైనప్పటికీ కచ్చితంగా ప్రణాళిక మాత్రం ఉంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మైండ్గేమ్ ఆడతారని మాకు తెలుసు' అని రహానే అన్నాడు.
ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 23 (గురువారం) నాడు జరగనుంది. గతంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టు సిరిస్ల్లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు మాటల దాడికి దిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్లెడ్జింగ్ చేయడానికి వెనకాడబోమని అన్న సంగతి తెలిసిందే.
ఇటీవలే ఓ ఇంటర్యూలో ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ గత కొన్నాళ్లుగా అద్భుతమైన ఫామ్లో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎట్టిపరిస్థితుల్లోనూ తమ జట్టు స్లెడ్జింగ్ చేయదని స్పష్టం చేశాడు.