ముంబై: క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్కు జీవిత సాఫల్య పురస్కారం అందించనున్నట్లు స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆఫ్ ముంబై (ఎస్జేఎమ్) ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 11న జరిగే ఎస్జేఎమ్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా గవాస్కర్కు ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు తెలిపింది.
ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్లో భారత్-ఇంగ్లాండ్ల మధ్య జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్ నాలుగో రోజున వాంఖడే స్టేడియంలో గవాస్కర్కు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ఎస్జేఎమ్ తెలిపింది.
2013 సెప్టెంబర్లో బాడ్మింటన్ లెజెండ్ నందూ నటేకర్కు జేఏఎమ్ తొలిసారి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. భారత క్రికెట్తో సునీల్ గవాస్కర్కు 50 ఏళ్ల అనుబంధం ఉంది. అక్టోబర్ 1966లో గవాస్కర్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్గా వజీర్ సుల్తాన్ XI తరఫున బరిలోకి దిగారు.
1970లో ముంబైలోని బ్రాబౌర్నీ స్టేడియంలో మైసూర్తో జరిగిన సెమీపైనల్ మ్యాచ్లో రంజీ ట్రోఫీలో పాల్గొన్నారు. 1970-71 కాలంలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లన గవాస్కర్ ఆ సిరీస్లో 774 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. అంతేకాదు టెస్టు క్రికెట్లో పది వేల పరుగుల క్లబ్లో చేరిన తొలి క్రికెటర్.
1983లో కపిల్ దేవ్ నేతృత్వంలోని వరల్డ్ కప్ సాధించిన జట్టులో గవాస్కర్ కూడా ఉన్నారు. ఆస్ట్రేలియాలో 1985లో జరిగిన బేసన్ అండ్ హెడ్గేస్ వరల్డ్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ గెలిచిన జట్టు కెప్టెన్ గా ఉన్నారు. కెరీర్లో 125 టెస్టు మ్యాచ్లాడిన గవాస్కర్ 34 సెంచరీలతో 10,122 పరుగులు చేశారు.
108 వన్డేలాడిన గవాస్కర్ 3 వేల పరుగులు సాధించారు. 1987లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. అప్పటినుంచి బీసీసీఐ టెక్నికల్ కమిటీ, ఐసీసీ క్రికెట్ కమిటీలకు చైర్మన్ గాను, ఐసీసీ మ్యాచ్ రిఫరీగాను, ముంబై క్రికెట్ సంఘానికి చైర్మన్ గాను, క్రికెట్ ఇంప్రూవ్ మెంట్ కమిటీలోనూ, భారత క్రికెట్ టీమ్ కు బ్యాటింగ్ కోచ్ గాను సేవలందించారు.
2014లో భారత్, యూఏఈల్లో జరిగిన ఐపీఎల్ టోర్నమెంట్కు గవాస్కర్ని బీసీసీఐ అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు ఎంపిక చేసింది.