హైదరాబాద్: టెస్టు క్రికెట్లో సంచలనాలకు మారుపేరు బంగ్లాదేశ్. శ్రీలంకతో ఆడిన 100వ టెస్టులో బంగ్లాదేశ్ సత్తా చాటింది. శ్రీలంకను శ్రీలంకలో ఓడించడం చాలా గౌరవంగా భావిస్తాయి ప్రపంచంలోని మిగతా జట్లు. గతేడాది శ్రీలంకలో పర్యటించిన ఆసీస్ మూడు టెస్టుల సిరిస్లో వైట్ వాష్కు గురైంది.
అలాంటిది శ్రీలంకతో జరిగిన వందో టెస్టులో బంగ్లాదేశ్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కొలంబోలో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 57.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 82 చక్కటి ఇన్నింగ్స్తో బంగ్లాదేశ్ విజయానికి పునాది వేయగా, షబ్బీర్ రెహమాన్ 41తో పాటు కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (22 నాటౌట్)తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో తమీమ్, షబ్బీర్ మూడో వికెట్కు 109 పరుగులు జోడించారు.
268/8 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 319 పరుగుల వద్ద ఆలౌటైంది. కరుణ రత్నే126 పరుగులతో సెంచరీ చేయగా, తిషారా పెరీరా(50), లక్మాల్(42)లు రాణించారు. దీంతో బంగ్లాదేశ్కు స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ తొలుత తడబడింది.
22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన క్రమంలో తమీమ్ ఇక్బాల్ ఆదుకున్నాడు. మూడో వికెట్ కు షబ్బిర్ రెహ్మాన్ తో కలిసి 109 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత తమీమ్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షబ్బీర్ రెహమా 41, ముష్ఫికర్ రహీం 22 నాటౌట్గా నిలిచారు.
ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ను బంగ్లాదేశ్ 1-1తో సమం చేసింది. ఆ జట్టుకిది వందో టెస్టు కావడం విశేషం. తమీమ్ ఇక్బాల్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలవగా, షకిబ్ ఉల్ హసన్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా ఎంపికయ్యాడు. తొలి టెస్టులో శ్రీలంక విజయం సాధించిన సంగతి తెలిసిందే.