హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ క్రికెట్ పునరాగమన ఆశలపై బీసీసీఐ నీళ్లు చల్లింది. స్కాట్లాండ్ క్రికెట్ లీగ్లో ఆడేందుకు చూస్తున్న అతడికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేయడానికి బీసీసీఐ నిరాకరించింది.
బీసీసీఐలో ఉన్నతాధికారి ఒకరు వెల్లడించిన సమాచారం మేరకు శ్రీశాంత్కు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేయడానికి బీసీసీఐ నిరాకరించింది. 2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్టు తమ విచారణలో తేలిందని, అందుకే అతడిపై జీవితకాల నిషేధం విధించామని బోర్డుకు చెందిన అధికారి తెలిపారు.
అయితే ఆ తర్వాత 2015లో ఢిల్లీకోర్టు నుంచి శ్రీశాంత్కు క్లీన్చిట్ లభించినా నిషేధం ఎత్తివేసే విషయంలో తుది నిర్ణయం బీసీసీఐకే ఉంటుందని ఆయన తెలిపారు. కాగా, బీసీసీఐ క్రమశిక్షణా కమిటీకి కేంద్ర ఆర్ధిక మంతి అరుణ్ జైట్లీ నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో శ్రీశాంత్తో పాటు మరికొందరు ఆటగాళ్లపై ఢిల్లీ హైకోర్టు నిషేధం ఎత్తివేసినా బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో శ్రీశాంత్కు ఎన్వోసీ జారీ చేయలేదు. కేరళకు చెందిన ఈ స్పీడస్టర్ గతేడాది కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరుపు నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.
ఇక భారత్ తరుపున 27 టెస్టు మ్యాచ్లాడిన శ్రీశాంత్ 87 వికెట్లు తీసుకున్నాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు తీసుకున్నాడు. 10 టీ20 లాడి 7 వికెట్లు తీసుకున్నాడు.