హైదరాబాద్: బుధవారం జరిగిన బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్కప్లలో ఫైనల్కు చేరుకున్న పురుషుల, మహిళల జట్లను ఎంపిక చేసిన సెలక్టర్లకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని తీర్మానించారు.
ఇందులో భాగంగా సెలక్షన్ కమిటీలలోని ఒక్కో సభ్యుడికి రూ. 15 లక్షల చొప్పున నజరానా అందజేస్తారు. మంచి జట్లను ఎంపిక చేసినందుకే వాళ్లకు ఈ బహుమతి అని సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ తెలిపింది. దేశవాళీ క్రీడాకారుల జీతాల పెంపుపై బోర్డు కోశాధికారి అనిరుధ్ చౌదరి మార్గదర్శకాలను రూపొందిస్తారని ఆమె వెల్లడించారు.
మరోవైపు అంతర్జాతీయ టోర్నీలకు, ఐపీఎల్కు మధ్య 15 రోజుల వ్యవధి ఉండాలన్న జస్టిస్ లోధా నిబంధనను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. ఇండియా-ఏ, అండర్-19 జట్ల కోసం ప్రత్యేకంగా మేనేజర్ను ఎంపిక చేయాల్సిన అవసరం లేదని బీసీసీఐ భావించినట్లు ఆమె తెలిపారు.
శ్రీశాంత్పై కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును బీసీసీఐ లీగల్ టీమ్ అధ్యాయనం చేస్తుందని ఎడ్ల్జీ వెల్లడించారు. ఇక కామెంటేటర్లుగా భారీగా ఆదాయం పొందుతున్న గవాస్కర్, మంజ్రేకర్, మురళీ కార్తీక్, హర్షా భోగ్లే తాము లోధా కమిటీ సిఫారసుల ప్రకారం 'కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్' పరిధిలోకి రావడం లేదని స్వయంగా హామీ పత్రం అందజేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు.
అజహరుద్దీన్ బకాయిలపై తేల్చని బీసీసీఐ!
బీసీసీఐ నుంచి తనకు రావాల్సిన బకాయిలు, ఆర్థిక పరమైన ప్రయోజనాలు అందజేయాలంటూ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ రాసిన లేఖపై బుధవారం బోర్డు సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే దీనిపై బీసీసీఐ, సీఓఏ ఓ నిర్ణయానికి రాలేకపోయింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఏజీఎంలో చర్చించాలని నిర్ణయించింది.
'అజహరుద్దీన్ అంశాన్ని మేం తీవ్రంగా చర్చించాం. మా న్యాయ నిపుణులు కూడా తమ సూచనలు ఇచ్చారు. అయితే దీనిపై తుది నిర్ణయం సర్వసభ్య సమావేశంలోనే తీసుకోవాలని తీర్మానించాం' అని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా చెప్పారు. మ్యాచ్ ఫిక్సింగ్కు సంబంధించి అజహరుద్దీన్ బీసీసీఐ నుంచి జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 2012లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అతడిపై అభియోగాలను కొట్టేసింది.