ముంబై: 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ వివాదాస్పద అంపైర్ అసద్ రవూఫ్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వేటు వేసింది. ఐదేళ్ల పాటు అతనిపై నిషేధం విధించింది.
ఐపీఎల్ సమయంలో బుకీల నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్నపాక్ అంపైర్ అసద్ రవూఫ్పై బీసీసీఐ ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. రవూఫ్పై ఆరోపణలు రావడంతో అదే ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి అతనికి ఐసీసీ ఉద్వాసన పలికింది.
59 ఏళ్ల అసద్ రవూఫ్ ఐసీసీ ఎలైట్ ప్యానల్లో ఉంటూ టెస్టు మ్యాచ్లకు అంపైర్గా కూడా పనిచేశాడు. ఐపీఎల్-2013 సమయంలో రవూఫ్ బుకీల నుంచి ఖరీదైన బహుమతులు తీసుకున్నట్లు క్రమశిక్షణ కమిటీ నిర్ధారించింది. దీంతో అతడిపై ఐదేళ్ల నిషేధం విధించింది.
బోర్డుతో సంబంధమున్న ఏ క్రికెట్ మ్యాచ్కైనా ఐదేళ్ల పాటు అతను అంపైరింగ్ చేసే అర్హత కోల్పోయాడని ప్రకటించింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో క్రికెటర్లు శ్రీశాంత్, చండీలా, అంకిత్ చవాన్ పై బీసీసీఐ ఇదివరకే చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.