హైదరాబాద్: బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించే మ్యాచ్లకు ఎలాంటి ఆటంకం కల్పించబోమని రాష్ట్ర సంఘాల నుంచి లిఖితపూర్వక హామీ తేవాలని సుప్రీం కోర్టు మాజీ ప్రధాని న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటైన లోధా కమిటీ బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రిని ఆదేశించింది.
అనర్హత వేటుతో పదవిని కోల్పోనున్న ఆయా సంఘాల ప్రతినిధులు మ్యాచ్ల నిర్వహణకు, నూతన కార్యవర్గానికి ఎలాంటి ఇబ్బందులు సృష్టించబోమని లిఖితపూర్వక హామీ పత్రాన్ని తేవాలని లోధా కమిటీ గురువారం బీసీసీఐ సీఈఓకి ఆదేశాలను జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే ఇటీవల సుప్రీం కోర్టు తీర్పుతో అనర్హత వేటుకు గురైన బీసీసీఐ బోర్డు సభ్యులు కొందరు తమ వ్యూహాలతో మ్యాచ్లను అడ్డుకునేందుకు, సంస్కరణల అమలు విషయంలో బీసీసీఐ కొత్త పాలక వర్గానికి సమస్యలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గురువారం న్యూఢిల్లీలో సమావేశమైన జస్టిస్ లోధాతో పాటు త్రిసభ్య కమిటీలో ఇతర సభ్యులుగా ఉన్న మాజీ న్యాయమూర్తులు అశోక్ భాన్, రవీంద్రన్ ఈ ఆదేశాలను జారీ చేశారు. మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన వివిధ అంశాలు కోర్టు పరిధిలో ఉన్నందున ఆ సంఘాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని లోధా కమిటీ నిర్ణయించింది.
కొత్త నిబంధనలను ఆమోదించి అమలులోకి తీసుకొస్తే తప్ప ఈ రెండు సంఘాలు తమ ఎన్నికల నిర్వహణ కోసం తప్పక ఎదుర చూడాల్సిందే. భారత క్రికెట్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు లోధా కమిటీ ప్రతిపాదించిన సంస్కరణలు తప్పకుండా అమలయ్యేలా చూడాలని ఈ సందర్భంగా బీసీసీఐ బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రికి లోధా కమిటీ తేల్చిచెప్పింది.