హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో అధికారుల నిర్లక్ష్యానికి టీమిండియాకు ఆడాలన్న ఏడుగురు యువ క్రికెటర్ల కలను తాత్కాలికంగా దూరం చేసింది. శ్రీలంకలో త్వరలో జరగబోయే యూత్ ఆసియా కప్లో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఇటీవలే ప్రకటించారు.
ఇందులో భాగంగా అండర్-19 జట్టు సభ్యులకు శుక్రవారం నుంచి బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సన్నాహక శిబిరం ఏర్పాటు చేశారు. అయితే జట్టులోని ఏడుగురు సభ్యులు యూత్ ఆసియా కప్లో ఆడేందుకు అనుగుణంగా లేరని చెపుతూ బీసీసీఐ వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసింది.
యూత్ ఆసియా కప్లో పాల్గొనే జట్టులోని క్రికెటర్ల పుట్టినరోజు 1998, సెప్టెంబర్ 1 లోపు ఉండాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ బీసీసీఐకి సమాచారమిచ్చింది. అయితే దీనిని 1997గా అర్ధం చేసుకున్న సెలక్టర్లు, బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ చౌధురీ ఆ మేరకు సమాచారం ఇచ్చారు.
నిజంగా ఇది ఘోర తప్పిదమని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అదృష్టవశాత్తూ జట్టు ఇక్కడ ఉండగానే జరిగిన తప్పిదాన్ని తమ దృష్టికి రావడంతో వెంటనే సెలక్టర్లకు సమాచారమందించామని, దాంతో ఏడుగురిని ఎంపిక చేశారని వివరించారు.
జట్టు శ్రీలంక చేరుకున్నాక ఈ విషయం తెలిసి ఉంటే పరిస్థితి ఇబ్బందికరంగా మారేదని ఆయన తెలిపారు. జట్టు నుంచి తప్పించిన వారిలో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సందీప్ తోమర్ (ఉత్తర ప్రదేశ్), దిగ్విజయ్ రంగి (హిమాచల్ ప్రదేశ్), డేరియల్ ఎస్ ఫెర్రారియో (కేరళ), రిషబ్ భగత్ (పంజాబ్), సిమ్రజిత్ సింగ్ (ఢిల్లీ), ఇజయన్ సయిద్ (మహారాష్ట్ర), చందన్ సహాని(హైదరాబాద్) ఉన్నారు.
వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ సందీప్ తోమర్ శ్రీలంకకు వెళ్లేందుకు పాస్ పోర్ట్, వీసా లాంటి అన్ని లాంఛనాలు పూర్తి చేసుకున్నాడు. ఇక ఎనిమిది రోజుల్లో శ్రీలంకకు వెళ్లేందుకు సిద్ధమైన తరుణంలో ఇలా జరగడంతో తోమర్ నిరాశకు గురయ్యాడు. మీడియం పేసర్ రిషబ్ భగత్ బీసీసీఐ నిర్ణయం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని తెలిపాడు.