హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్ కోసం ఆహ్వానించిన దరఖాస్తుల గడువుని పెంచింది. జులై 9 వరకు కోచ్ పదవికి అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
ముందు గౌరవించడం నేర్చుకోండి: 'మళ్లీ దరఖాస్తులను ఆహ్వానిస్తారా?'
ఈ మేరకు బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి ఓ ప్రకటన విడుదల చేశారు. పురుషుల ప్రధాన కోచ్ పదవికి ఆహ్వానించిన దరఖాస్తుల గడువ తేదీని పెంచుతున్నామని అందులో పేర్కొన్నారు. అంతకముందు కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది.
అయితే కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసిన వ్యక్తులు వ్యక్తిగతంగా, వీడియో ఇంటర్వ్యూలకు అందుబాటులో ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ప్రధాన కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా ప్రకటించిన తర్వాత బీసీసీఐ కోచ్ పదవికి దరఖాస్తు గడువును పెంచిన సంగతి తెలిసిందే.
మే 31 నాటికి గడువు ముగిసే సమయానికి కోచ్ పదవి కోసం టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్, సన్రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్మూడీ, రిచర్డ్ పైబస్, లాల్చంద్ రాజ్పుత్, దొడ్డా గణేష్లు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కోచ్ పదవి కోసం గడువు పెంచిన నేపథ్యంలో మరికొందరు రేసులో నిలిచే అవకాశాలున్నాయి.
కాగా, టీమిండియా డైరెక్టర్గా పని చేసిన అనుభవం ఉన్న రవిశాస్త్రిని బీసీసీఐ కోచ్ పదవికి అప్లై చేయని కోరగా, కోచ్ పదవి ఇస్తానంటేనే అప్లే చేస్తానంటూ కండిషన్ పెట్టిన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కోచ్ పదవికి బీసీసీఐ మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించడాన్ని కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న లాల్చంద్ రాజ్పుత్ తప్పుబట్టాడు.
ముగింపు తేదీ నాటికి దరఖాస్తు చేసుకున్న ఐదుగురు వ్యక్తులు పనికిరారా? వాళ్లపై నమ్మకం లేదా? అని ప్రశ్నించారు. కుంబ్లే రాజీనామా చేసిన వెంటనే మళ్లీ కొత్తగా దరఖాస్తులను ఎందుకు ఆహ్వానించారంటూ రాజ్పుత్ బీసీసీఐ తీరుపై మండిపడ్డారు.
నిజానికి కుంబ్లే రాజీనామాతో ప్రధాన కోచ్ పదవికి సరైన వ్యక్తిని ఎంపిక చేసేందుకు గంగూలీ, లక్ష్మణ్, సచిన్తో కూడిన క్రికెట్ సలహా కమిటీ ముందు మరిన్ని అప్లికేషన్స్ ఉంచాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త దరఖాస్తులు ఆహ్వానించడం మమ్మల్ని అవమానించడమే అని క్రికెట్ నెక్ట్ అనే వెబ్ సైట్కి ఇచ్చిన ఇంటర్యూలో లాల్చంద్ స్పష్టం చేశాడు.
ప్రొఫెషనల్గా ఉండటం కాదు ముందు దరఖాస్తు చేసుకున్న వారిని గౌరవించడం నేర్చుకోండి అంటూ బీసీసీఐ తీరుపై మండిపడ్డాడు.