కోల్కతా: వెస్టిండీస్ క్రికెట్ స్టార్ డ్వేన్ బ్రావో సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే వెస్టిండీస్ బోర్డు పైన ఆ జట్టు కెప్టెన్ డారెన్ సామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతనికి తాజాగా డ్వేన్ బ్రావో జత కలిశాడని చెప్పవచ్చు.
డ్వేన్ బ్రావో మాట్లాడుతూ... తమకు బిసిసిఐ నుంచి మంచి మద్దతు లభించిందని చెప్పాడు. తమకు బిసిసిఐ ఎంతో చేసిందని ఉద్వేగానికి లోనయ్యాడు. తద్వారా తమ వెస్టిండీస్ జట్టు తమకు ఏం చేయలేదని బ్రావో కూడా మండిపడ్డాడు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. తమ క్రికెట్ జట్టు బోర్డు సరైన వారి చేతుల్లో లేదని చెప్పాడు. తమకు ఇప్పటి వరకు ఏ బోర్డు అధికారి నుచి లేదా డైరెక్టర్ నుంచి ఫోన్ కాల్ రాలేదని చెప్పాడు. ఇది సరైనది కాదని విమర్సించాడు.
మ్యాచ్కు ముందు తమకు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని చెప్పాడు. తాము కప్ గెలవమని వారు బాగా నమ్మి ఉంటారని ఎద్దేవా చేశాడు. ఇది జట్టు ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకమని చెప్పాడు. అదే సమయంలో బిసిసిఐ మాకు ఎంతో చేసిందని చెప్పాడు.
తనను, క్రిస్ గేల్, రస్సెల్ వంటి ఆటగాళ్లను వెస్టిండీస్ బోర్డు వన్డేలకు పక్కన పెట్టిందని, ఇది సరైన చర్య కాదన్నాడు. ఇక్కడ (భారత్) తమకు ఎంతో ప్రేమ దొరికిందని చెప్పాడు. బిసిసిఐ ఎంతో మద్దతు ఇచ్చిందని ఒకటికి రెండుసార్లు చెప్పాడు. కరేబియన్లను క్రికెట్ ఒక్కటి చేస్తుందని చెప్పాడు.