హైదరాబాద్: రవిశాస్త్రి నియామకంతో టీమిండియా ప్రధాన కోచ్ ఎవరన్న ఉత్కంఠకు తెర పడింది. అయితే ఇప్పుడు భారత క్రికెట్ జట్టుకు కొత్త మేనేజర్ని ఎంపిక చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ మేరకు శనివారం టీమిండియా కొత్త మేనేజర్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జులై 21 లోపు తమ దరఖాస్తులను పంపించాలని కోరింది. "పురుషుల క్రికెట్ జట్టు కోసం బీసీసీఐ దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు" అని బోర్డు తన అధికారిక వెబ్సైట్లో ప్రకటనను ఉంచింది. జట్టు మేనేజర్ పదవి ఏడాది వరకు ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొంది.
జాతీయ లేదా అంతర్జాతీయ స్ధాయిలో క్రికెట్ ఆడిన అభ్యర్ధులు ఇందుకు అర్హులంటూ అందులో పేర్కొంది. బీసీసీఐ లేదా దాని అనుబంధ యూనిట్లు లేదా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జట్టుకు పదేళ్ల పాటు సేవలందించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అంతేకాదు అభ్యర్ధి వయసు 60 ఏళ్లకు మించకూడదనే నిబంధనను కూడా పెట్టింది.
నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా మేనేజర్ని మార్చాల్సిన అవసరం ఏమిటి.ఒక్కసారిగా ఈ అంశం ఎందుకు తెరపైకి వచ్చిందనేది ప్రతి ఒక్క అభిమాని మదిలో మెలిగే ప్రశ్న. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ప్రస్తుత జట్టు పరిపాలన మేనేజర్ కపిల్ మల్హోత్ర సమర్పించిన నివేదికే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
అతను సమర్పించిన నివేదికే అతని ఉద్యోగాని ఎసరు తెచ్చిపెట్టింది. సాధారణంగా స్వదేశంలో కానీ, విదేశంలో కానీ భారత జట్టు ఏ టోర్నీ ఆడినా.. సదరు టోర్నీ ముగిసిన అనంతరం జట్టు మేనేజర్ బోర్డు(బీసీసీఐ)కి రిపోర్టు అందించాలి. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం జట్టు మేనేజర్ కపిల్ మల్హోత్రా అందించిన నివేదిక బీసీసీఐని ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది.
ఎందుకంటే కపిల్ మల్హోత్రా తన నివేదికలో కోహ్లీ-కుంబ్లే సంబంధాలపై తీవ్రమైన అభిప్రాయాలేమీ వ్యక్తం చేయలేదు. ముఖ్యంగా కోహ్లీకి ప్రతికూలమైన అంశాలేమీ పొందుపరచలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ జరిగిన సమయంలో కోహ్లీ-కుంబ్లే పెద్దగా మాట్లాడుకోలేదని, ఇరువురి మధ్య ఎలాంటి గొడవ చోటు చేసుకోవడం తాను చూడలేదు అని మాత్రమే పేర్కొన్నాడు.