హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విసిరిన హార్డ్ బాల్కి బీసీసీఐ క్లీన్బౌల్డ్ అయింది. ఐసీసీ బోర్డు సమావేశంలో బుధవారం బీసీసీఐకి ఎదురు దెబ్బ తగిలింది. బీసీసీఐ సూచించిన ప్రతిపాదనలు తిరస్కరించబడ్డాయి. కొత్త ఆదాయ పంపిణీ విధానం, పరిపాలనా విధానాల్లో మార్పులకు అనుకూలంగా నిర్వహించిన ఓటింగ్లో బీసీసీఐకి వ్యతిరేక ఫలితాలొచ్చాయి.
దుబాయ్లో బుధవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశాల్లో తొలిరోజు పరిపాలనా విధానం, కొత్త ఆదాయ పంపిణీ విధానంపై ఓటింగ్ నిర్వహించారు. పరిపాలన విధానంపై 1-9, గత కొంతకాలంగా పొరాడుతున్న ఆదాయ పంపిణీ విధానంపై 2-8తో బీసీసీఐ ఓటమి పాలైంది. శ్రీలంక మాత్రమే భారత్కు అనుకూలంగా ఓటు వేసింది.
'అవును. ఓటింగ్ ముగిసింది. కొత్త ఆదాయ నమూనాకు 8-2, విధి విధానాల మార్పులకు 9-1తో అనుకూలంగా ఓట్లు వచ్చాయి. బీసీసీఐ రెండింటికీ వ్యతిరేకంగా ఓటు వేసింది. ప్రతిపాదిత మార్పులేవీ భారత్కు అస్సలు అనుకూలం కాదు. వెంటనే మేం అనుబంధ సంఘాలతో ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించి పరిస్థితిని వారికి తెలపాలి' అని దుబాయ్లోని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
ప్రస్తుతం ఐసీసీలో కొనసాగుతున్న బిగ్-3 పద్ధతిలో బీసీసీఐకి తొమ్మిదేళ్ల వ్యవధిలో దాదాపు రూ.3,667 కోట్లు రావాల్సి ఉంది. మనోహర్ ఛైర్మన్ అయ్యాక ప్రతిపాదించిన కొత్త విధానం ప్రకారం బీసీసీఐ ఆదాయం రూ.1,866 కోట్లకు పడిపోనుంది. బీసీసీఐ ఆదాయంలో పెద్ద ఎత్తున కోత పడనున్న నేపథ్యంలో అదనంగా 100 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.650 కోట్లు) ఐసీసీ తరఫున ఇచ్చేందుకు సిద్దమైంది.
అయితే ఈ ప్రతిపాదనను బీసీసీఐ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే ఓటింగ్ జరిగింది. టోర్నీలో పాల్గొనబోయే మిగతా ఏడు దేశాలూ తమ జట్లను ప్రకటించగా, బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం మంగళవారం (ఏప్రిల్ 25) లోపే జట్లను ప్రకటించాలి.
తమ రెవెన్యూ వాటాను తగ్గిస్తే చాంపియన్స్ ట్రోఫీలో ఆడబోమని గతంలో బోర్డు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐసీసీలో భారత్కు వ్యతిరేకంగా అడుగులు పడుతుండటంతో బీసీసీఐ ఇప్పుడు ఏం చేస్తుందనేది ప్రశ్న క్రికెట్ విశ్లేషకులను ఆలోచింపజేస్తోంది.