హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త ఆదాయ పంపిణీ పద్ధతి ప్రకారం బీసీసీఐకి రూ.2615 కోట్లు ఇచ్చింది. ఏప్రిల్లో ఐసీసీ ప్రకటించిన మొత్తం కంటే ఇది చాలా ఎక్కువ. ఐసీసీ కొత్త ఆదాయ పంపిణీ పద్ధతి ప్రకారం అప్పట్లో బీసీసీఐకి రూ. 1892 కోట్లు మాత్రమే ఇస్తామని ఐసీసీ ప్రకటించింది.
దీంత ఈ ఆదాయ పంపిణీ విధానాన్ని బీసీసీఐ తీవ్రంగ్ వ్యతిరేకించింది. ఐసీసీకి బీసీసీఐ వల్లే ఎక్కువ ఆదాయం వస్తుందని, కాబట్టి తమకే ఎక్కువ ఆదాయం తమకే చెల్లించాలని బీసీసీఐ పట్టుబట్టిన సంగతి తెలిసిందే. ఆ మొత్తానికి కనీసం మరో రూ.645 కోట్లన్నా ఇవ్వాలని డిమాండ్ చేసింది.
అయితే ఇప్పుడు బీసీసీఐ అంచనా వేసిన దానికంటే కాస్తంత ఎక్కువే ఇచ్చింది. ఈ కొత్త ఆదాయ పంపిణీ పద్ధతి ప్రకారం బీసీసీఐ తర్వాత ఇంగ్లండ్ బోర్డుకు రూ.923 కోట్లు వచ్చాయి. అత్యల్పంగా జింబాబ్వే బోర్డుకు రూ.602 కోట్లు ఇవ్వగా, మిగతా ఏడు బోర్డులకు రూ.852 కోట్ల చొప్పున ఆదాయాన్ని ఐసీసీ పంపిణీ చేసింది.
పాత పద్ధతి ప్రకారం బీసీసీఐ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బోర్డులు ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని అందుకునేవి. అయితే శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ అయిన తర్వాత ఈ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఈ కొత్త ఆదాయ పంపిణీ విధానాన్ని ఐసీసీ 13-1 ఓట్లతో ఆమోదించిన సంగతి తెలిసిందే.
ఏది ఏమైనా ఐసీసీకి వచ్చిన మొత్తం ఆదాయంలో బీసీసీఐ 22.8 శాతం ఆదాయాన్ని పొందగా, ఆ తర్వాత ఇంగ్లాండ్ 7.8 శాతం పొందగా మిగతా బోర్డులు 7.2 శాతం ఆదాయాన్ని పొందాయి. జింబాబ్వే అత్యల్పంగా 5.3 శాతం ఆదాయాన్ని పొందింది.