హైదరాబాద్: భారత క్రికెటర్ల కోసం ఖరీదైన ఇటాలియన్ సూట్లను కొనుగోలు చేయాలనే సీఈవో రాహుల్ జోహ్రి చేసిన ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. భారత ఆటగాళ్లతోపాటు బోర్డు టాప్ ఎగ్జిక్యూటివ్లకు రూ 2.5 లక్షల (ఒక్కొక్కటి) విలువైన 50 సూట్లను కొనుగోలు చేసేందుకు అనుమతి కావాలని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే, ఇతర సభ్యులకు నవంబర్ 19న జోహ్రి మెయిల్ చేశాడు.
ఆ ఖరీదైన సూట్లను వేసుకుంటే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోతుందని జోహ్రీ ఆ మెయిల్లో బీసీసీఐకి వెల్లడించాడు. అయితే ఈ ప్రతిపాదనను బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తొసిపుచ్చారు. బీసీసీఐది కార్పోరెట్ కల్చర్ కాదని ఆయన స్పష్టం చేశారు.
కల నెరవేరింది: దక్షిణాఫ్రికా టు ఇంగ్లాండ్ ఇలా (ఫోటోలు)
ప్రస్తుతం తామున్న పరిస్థితుల్లో మ్యాచ్ల నిర్వహణే కష్టమవుతోందని, అంత ఖరీదైన సూట్లు తెప్పించుకునే అవకాశం లేదని అన్నారు. బోర్డుతో పాటు రాష్ట్ర క్రికెట్ సంఘాలు లోధా కమిటీ కొత్త ప్రతిపాదనలను అమలు చేసేవరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేని సంగతి తెలిసిందే.
దీనిపై బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కే మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం ఎలాంటి కొత్త ఒప్పందాలను చేసుకోలేమని జోహ్రీకి సమాధానమిచ్చాడు. మరోవైపు లోధా కమిటీ అనుమతి తీసుకోవాలని బోర్డు న్యాయ సలహాదారు అభినవ్ ముఖర్జీ సూచించారు.
అయిత్ అనురాగ్ ఠాకూర్ మాత్రం లోధా కమిటీని సంప్రదించాల్సిన అవసరమేమీ లేదని, జోహ్రీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు. లోధా కమిటీ సూచనలు అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు ఒత్తిడి, బీసీసీఐ దుబారాపై నిఘా ఉండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.