న్యూఢిల్లీ: ప్రకటన విరామాలపై లోధా కమిటీ సూచనలను అమలు చేస్తే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రూ.1600 కోట్లు నష్టపోనుంది. ఆదాయం తగ్గిపోతే బీసీసీఐ నిర్వహణతోపాటు జూనియర్ క్రికెట్ అభివృద్ధికి పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
బీసీసీఐ ఆస్తి అప్పుల పట్టీ ప్రకారం ప్రస్తుత రాబడి రూ.2000 కోట్లు. ఇందులో సింహభాగం ప్రసార హక్కులు, ప్రకటనల నుంచే వస్తుంది. కానీ భోజనం, టీ, డ్రింక్స్ విరామాల్లో మాత్రమే ప్రకటనలు ఉండాలన్నది లోధా కమిటీ సూచన. దాన్ని అమలు చేస్తే బోర్డు ఆదాయం రూ.400 కోట్లకు పడిపోయే అవకాశముంది.
ప్రస్తుతం ప్రతీ బిసిసిఐ మ్యాచుకు స్టార్ స్పోర్ట్స్ రూ. 43 కోట్లు చెల్లిస్తోంది. లోధా కమిటీ సూచనలు అమలైతే ఆ మొత్తం ఆదాయం రూ. 8-10 కోట్లకు పడిపోతుందని బిసిసిఐ పేర్కొంటోంది.
రాష్ట్ర క్రికెట్ సంఘాలకు రూ. 750 కోట్ల సబ్సిడీలను బిసిసిఐ అందజేస్తోంది. అంతేగాక, అండర్-16 నుంచి సీనియర్ జట్ల వరకు దాదాపు రూ. 450 కోట్ల రూపాయలను బిసిసిఐ ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో లోధా కమిటీ సూచనలు అమలు చేస్తే.. వీటన్నింటికీ కేటాయింపులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని చెబుతోంది.