న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారసులను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీసీసీఐ ఆలోచనలో పడింది. ముఖ్యంగా ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ హక్కులపై తర్జన భర్జనలు పడుతోంది. దీంతో ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ హక్కుల టెండర్ల ప్రక్రియలో ఏం చేయాలని స్పష్టత కోరుతూ లోధా కమిటీకి లేఖ రాసింది.
వివరాల్లోకి వెళితే... ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ హక్కుల్లో భాగంగా ఇటీవల బీసీసీఐ బహిరంగ టెండర్లు ఆహ్వానించింది.. అక్టోబర్ 25న ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఈ లోగా బీసీసీఐ ఆర్ధిక లావాదేవీలకు సుప్రీం బ్రేక్ వేసింది. బీసీసీఐ కాంట్రాక్టులను పరిశీలించేందుకు గాను లోధా కమిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర ఆడిటర్ను నియమించుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
దీంతో ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ హక్కులపై ఏమి చేయాలో చెప్పాలంటూ లోధా కమిటీకి లేఖ బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కే లేఖను రాశారు.
బీసీసీఐకి సుప్రీం షాక్: ఆర్ధిక లావాదేవీలు నిలిపివేత 'ఐపీఎల్ టెండర్ల ప్రక్రియను బీసీసీఐ ఇప్పటికే మొదలు పెట్టింది. అక్టోబర్ 25న ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఐపీఎల్ ప్రసార హక్కులపై తుది నిర్ణయం తీసుకోవాలి. అంతర్జాతీయంగా పేరున్న సంస్థలు పోటీలో ఉన్నాయి. టెండర్లలో పారదర్శకత కోసం డెలాయిట్ సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాం. ఈ లోగా బీసీసీఐ ఫైనాన్స్ వ్యవహారాలను పరిశీలించేందుకు స్వతంత్ర ఆడిటర్ను నియమించుకోవడానికి సుప్రీం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో టెండర్లను నిర్వహించాలా, రద్దు చేయాలా, కొత్తగా నిర్వహించాలా.. ఏం చేయాలో స్పష్టత ఇవ్వండి' అంటూ లేఖలో పేర్కొన్నారు.
కాగా, 2018 ఏడాదితో మొదలు పెట్టి ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులను పదేళ్ల కోసం, డిజిటల్, మొబైల్ హక్కులను ఐదేళ్ల కాలానికి ఇచ్చేందుకు గాను బీసీసీఐ బహిరంగ టెండర్ ప్రక్రియ ద్వారా ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులు కోరిన సంగతి తెలిసిందే.
2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి 2017 వరకు పదేళ్ల కాలానికి టీవీ హక్కులు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (ఎస్పీఎన్ఐ) వద్ద ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ ఒప్పందం ముగియనుండటంతో బీసీసీఐ సరికొత్త బిడ్డింగ్ ప్రక్రియకు తెరదీసింది. ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్తో పాటు జిటల్, మొబైల్ రైట్స్కు కలిపి బీసీసీఐ ఒకే బిడ్డింగ్ ఏర్పాటు చేసింది.
ఈ బిడ్డింగ్ ప్రక్రియలో మీడియా హక్కుల కోసం ఆహ్వాన టెండర్ (ఐటీటీ)ను ఫేస్బుక్, ట్విటర్ సహా 18 సంస్థలు కొనుగోలు చేశాయని బోర్డు ఇప్పటికే ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 18 వరకూ ఐటీటీ డాక్యుమెంట్ విక్రయాలు జరిపారు. అక్టోబర్ 25న ఎంపికైన బిడ్డర్ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.
ఎవరికి లాభం?: ఐపీఎల్పై కన్నేసిన ఫేస్బుక్, ట్విట్టర్ టీవీ ప్రసారం కోసం సోనీ, స్టార్ గ్రూప్ల మధ్య భారీ పోటీ నెలకొని ఉంది. కాగా, ఇతర హక్కుల కోసం ట్విట్టర్, ఫేస్బుక్తో పాటు అమెజాన్, రిలయన్స్ జియో, టైమ్స్ ఇంటర్నెట్, గల్ఫ్ డీటీహెచ్, ఈఎస్పీఎన్, జీ తదితర కంపెనీలు పోటీ పడుతున్నాయి.