న్యూఢిల్లీ: పాకిస్థాన్ జట్టుతో క్రికెట్ ఆడేందుకు అనుమతించాలని బీసీసీఐ కేంద్రానికి లేఖ రాసింది. ఈ మేరకు బీసీసీఐ కేంద్రానికి లేఖ రాసినట్లు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. 2008లో ముంబైపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
అయితే ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరిస్లను పునరుద్ధరించాలని రెండు దేశాల బోర్డుల నిర్ణయం తీసుకున్నాయి. ఇందుకు ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో ఇప్పుడు రెండు దేశాలు ప్రభుత్వ నిర్ణయం కీలకం కానుంది.
అయితే తటస్థ వేదికపై ఈ ద్వైపాక్షిక సిరిస్ను నిర్వహించాలని బీసీసీఐ చీఫ్ శశాంక్ మనోహర్, పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్లు నిర్ణయించారు.
ఇరు దేశాల ప్రభుత్వాలు అంగీకరిస్తే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ రెండు భాగాలుగా జరగనుంది. వన్డే, టి20 సిరీస్ శ్రీలంకలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. టెస్టు సిరిస్ను ఇంగ్లాండ్లో నిర్వహించే అవకాశం ఉంది. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ఇప్పటికే పాక్ తమ ప్రభుత్వాన్ని అనుమతి కోరుతూ లేఖ రాసింది. మరోవైపు ఇరు ప్రభుత్వాల నుంచి సిరీస్కు అనుమతి లభించేదాకా మీడియాకు ఎలాంటి వివరాలను వెల్లడించకూడదని బీసీసీఐ, పీసీబీ నిర్ణయం తీసుకున్నాయి.
ఇక పాకిస్థాన్లో తొలిసారిగా నిర్వహించబోతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో భారత ఆటగాళ్లు కూడా ఆడాలని పీసీబీ కోరుకుంటే ఆలోచిస్తామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఐపీఎల్లో మినహా భారత ఆటగాళ్లను ఏ ఇతర విదేశీ టి20 లీగ్ల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతించని సంగతి తెలిసిందే.