హైదరాబాద్: జస్టిస్ లోధా కమిటీ సూచించిన సిఫారసులను అమలు చేసేందుకు గాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైను నియమించాలంటూ సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో సహాయకుడు అమికస్ క్యూరీ పేర్కొన్నారు.
సంస్కరణ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బీసీసీఐ అధ్యక్షుడిని జైల్లో కూడా పెట్టవచ్చని ఆయన తెలిపారు. బోర్డు అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని వెంటనే ఆ పదవి నుంచి అతడిని తప్పించాలని సూచించారు. ఈ మేరకు గోపాల్ సుబ్రహమణ్యం నేతృత్వంలోని అమికస్ క్యూరీ గురువారం కోర్టుకు నివేదిక సమర్పించారు.
కోర్టుకు తప్పుడు వాంగ్మూలాలు, సాక్ష్యాలు ఇచ్చారని మండిపడ్డారు. అయితే కేసుపై వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పును వాయిదా వేసింది. బీసీసీఐలో కాగ్ అధికారి నియామకం ప్రభుత్వ జోక్యం కిందికి వస్తుందనే విషయమై అనురాగ్ ఠాకూర్ ఐసీసీకి లేఖ రాశారు. దీనిపై సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు.
బీసీసీఐలో కాగ్ అధికారి నియామకం ప్రభుత్వ జోక్యం కిందికి వస్తుందా రాదా? అన్న అంశంపై తాను ఐసీసీకి లేఖ రాయలేదని సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్లో ఠాకూర్ పేర్కొన్నారు. దీంతో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారన్న అభియోగం ఎదుర్కొంటున్న ఆయనపై అసత్య ప్రమాణం కేసు దాఖలు చేసే అవకాశం ఉంది.
గురువారం దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేసు నమోదుపై సూచనప్రాయంగా వెల్లడించింది. అవసరమైతే దీనిపై విచారణకు ఆదేశిస్తామని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ విచారణ నుంచి తప్పించుకోవాలంటే ఠాకూర్ క్షమాపణ చెప్పుకోవచ్చని, అయితే దానిని కూడా తాము అంగీకరిస్తామో లేదో చెప్పలేమని ధర్మాసనం తెలిపింది.
అయితే ఠాకూర్ ఐసీసీ చైర్మన్ సీఈఓ డేవ్ రిచర్డ్సన్కు లేఖ రాసినట్లు లోధా ప్యానెల్ సుప్రీంకోర్టు చెప్పడంతో ఇప్పుడు ఠాకూర్ చిక్కుల్లో పడ్డారు. బోర్డులోని ఉన్నతాధికారులందరినీ తొలగించి.. వారి స్థానంలో మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి జీకే పిళ్లైని నియమించాల్సిందిగా లోధా ప్యానెల్ సుప్రీంకోర్టును కోరిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణను రెండు సార్లు వాయిదా వేసింది. అయితే శుక్రవారం తర్వాత కోర్టుకు శీతాకాల సెలవులు ఉండటంతో ఈలోపే సుప్రీం ధర్మాసనం లోధా కమిటీ పిటిషన్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే వార్తలు జాతీయ మీడియాలో వస్తున్నాయి.