పూణె: గాంధీ-మండేలా సిరిస్ పేరిట భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య టెస్టు సిరిస్ను బీసీసీఐ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు సిరిస్లో విజేతలకు ఇచ్చే 'ఫ్రీడం ట్రోఫీ' వినూత్నంగా ఉండాలని బీసీసీఐ భావిస్తోంది.
ఈ సిరిస్ మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలాలను గుర్తు చేసుకుంటూ సాగుతున్న నేపథ్యంలో 'ఫ్రీడం ట్రోఫీ' తయారీ కోసం వారిద్దరిని బందీలుగా చేసి ఉంచిన జైలు గదుల ఊచలను ఒక చోటికి చేర్చి 'ఫ్రీడం ట్రోఫీ'కి మెరుగులు దిద్దాలనేది బీసీసీఐ ప్రతిపాదన.
ఈ విషయాన్ని చెబుతూ తమకు రెండు ఊచలు ఇప్పించాల్సిందిగా బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ స్వయంగా అక్టోబర్ 7వ తేదీన పుణేలోని జైళ్ల డీజీకి లేఖ రాశారు. తాను ఈ లేఖను అందుకున్నట్లు జైళ్ల డీజీ బీకే ఊపాధ్యయ వెల్లడించారు.
కాగా, ఈ లేఖపై ఇప్పటికింకా నిర్ణయం తీసుకోనప్పటికీ, టెస్టు మ్యాచ్ ట్రోఫీ గాంధీ, మండేలా నివసించిన జైలు గదుల ఊచలతోనే తయారవుతుందని సమాచారం. కాగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నవంబర్ 5 నుంచి టెస్టు సిరిస్ ప్రారంభం కానుంది.