హైదరాబాద్: బీసీసీఐ వెబ్సైట్ నుంచి ఆఫీస్ బేరర్స్ లిస్టులో అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కే పేర్లను తొలగించారు. లోధా కమిటీ ఇచ్చిన సిఫారసులు అమలు చేయలేదనే కారణంతో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేను తొలగిస్తూ సుప్రీం కోర్టు సోమవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
సుప్రీం తీర్పు నేపథ్యంలో బీసీసీఐ వెబ్సైట్లో ఉన్న ఆఫీస్ బేరర్ల జాబితా నుంచి వారిద్దరి పేర్లను తొలగించారు. ప్రస్తుతం బీసీసీఐ ఆఫీసు బేరర్ల జాబితాలో ఐదుగురు ఉపాధ్యక్షుల పేర్లు మాత్రమే ఉన్నాయి. బోర్డులో మొత్తం ఐదుగురు ఉపాధ్యక్షులు ఉన్నారు.
టీసీ మాథ్యూ (వెస్ట్ జోన్), సీకే ఖన్నా (సెంట్రల్ జోన్), గౌతమ్ రాయ్ (ఈస్ట్ జోన్), ఎమ్ఎల్ నెహ్రూ (నార్త్ జోన్), గోగరాజు గంగరాజు (సౌత్ జోన్) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీసీసీఐ పాలనా వ్యవహారాలకు సంబంధించి కొత్త సభ్యులను ఎంపిక చేసేందుకు ప్రముఖ న్యాయవాది ఎఫ్ఎస్ నారిమన్, గోపాల్ సుబ్రమణ్యంలను సుప్రీం కోర్టు నియమించింది.
బీసీసీఐ ఉపాధ్యక్షుల్లో సీనియర్ను తాత్కాలిక అధ్యక్షుడిగా నామినేట్ చేయమని కూడా సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది. ఇక కొత్త సభ్యులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని జనవరి 19న ప్రకటిస్తామని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. వీరిద్దరూ కలిసి బీసీసీఐ కొత్త సభ్యులను ఎంపిక చేస్తారు.
కోర్టు ఆదేశాల ప్రకారం ఉపాధ్యక్షుల్లో తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు ఎవరూ తీసుకుంటారనే దానిపై చర్చ మొదలైంది. బోర్డు ఉపాధ్యక్షుల్లో ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ అసోసియేషన్ (డీడీసీఏ) అధికారి సీకే ఖన్నా అందరిలో సీనియర్. సెంట్రల్ జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖన్నా మూడోసారి ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుతున్నాడు.
ఖన్నా తర్వాత అసోం క్రికెట్ సంఘం అధ్యక్షుడు గౌతమ్ రాయ్ ఉన్నారు. వెస్ట్జోన్కు చెందిన గౌతమ్ రాయ్ రెండోసారి ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. రాయ్పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీరిద్దరూ కూలింగ్ ఆఫ్ పీరియడ్లోకి వస్తారు. ఆ తర్వాత అధ్యక్ష రేసులో ఉన్న గోకరాజు గంగరాజు కూడా కూలింగ్ ఆఫ్ పీరియడ్లోకి వస్తారు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా ఉన్న సౌరభ్ గంగూలీ సమర్థత, నిజాయితీ లాంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని అతడి పేరు ఖాయమైనట్టే అని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
అయితే దీనిపై గంగూలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనే సందేహాన్ని కూడా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా పేరున్న బీసీసీఐని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అయితేనే సమర్ధవంతంగా నడపగలడని పలువురు అభిప్రాయపడుతున్నారు.