న్యూఢిల్లీ: 'భారత్లో మా జట్టుకు ప్రమాదముంది.. మా ప్రభుత్వం అనుమతిస్తుందో లేదో' అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు బీసీసీఐ ఘాటైన సమాధానమే చెప్పింది. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు భారత్ రావాలో లేదో తేల్చుకోవాల్సింది పాకిస్థానేనని.. తామైతే అన్ని జట్లకు పూర్తి భద్రత కల్పిస్తామని స్పష్టం చేసింది.
భారత దేశంలో క్రికెట్ ఆడటానికి ఏ దేశం కూడా భయపడాల్సిన అవసరం లేదని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా తమ ప్రభుత్వం భారత్లో టి20 ప్రపంచకప్ ఆడేందుకు అనుమతి ఇవ్వకపోవచ్చని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఠాకూర్ ఈ ప్రకటన చేశారు. ఎవరికైనా భారత్లో ఆడటం ఇష్టం లేకపోతే ఐసీసీకి నిర్ణయం తెలపొచ్చని, తాము మాత్రం అందరికీ పటిష్టమైన భద్రత కల్పిస్తామని ఠాకూర్ అన్నారు.
'ప్రపంచకప్ను బీసీసీఐ వీలైనంత సాఫీగా నిర్వహించడానికి ప్రయత్నిస్తుంది. ప్రతి జట్టుకూ అత్యుత్తమ భద్రతను కల్పిస్తుంది. గతంలోనూ అనేక ప్రపంచకప్లు, అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చాం. కాబట్టి ఇక్కడ ఏ దేశం కూడా భద్రత గురించి భయపడాల్సిన అవసరం లేదు' అని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
ఒక వేళ భద్రతపై పాకిస్థాన్ సంతృప్తి చెందకపోతే.. ఆ దేశం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని ఠాకూర్ తెలిపాడు. 'ద్వైపాక్షిక సిరీస్ పూర్తిగా వేరే విషయం. ప్రపంచకప్లో అనేక దేశాలు పోటీపడతాయి. 16 జట్లలో పాకిస్థాన్ ఒకటి. అన్ని జట్లకు భారత ప్రభుత్వం పూర్తి భద్రతను కల్పిస్తుంది. ఏ దేశానికైనా ఇబ్బంది అనిపిస్తే.. ఏం చేయాలో నిర్ణయించుకోవాల్సింది ఆ దేశమే'' అని ఠాకూర్ చెప్పాడు.
పాక్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు బీసీసీఐ తిరస్కరిస్తున్న నేపథ్యంలో పీసీబీ.. టీ20 ప్రపంచకప్ ముందు భారత్ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే భద్రత కారణాలతో భారత్లో పర్యటించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం తమ జట్టుకు అనుమతించకపోవచ్చని ఇటీవల ఐసీసీ అధికారులతో పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ చెప్పాడు.