న్యూఢిల్లీ: యూత్ ఐకాన్, రోల్ మోడల్గా ఉండటం చాలా కష్టమైన విషయమని టీమిండియా స్టార్ బ్యాట్స్మన్, టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-9లో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీకి ఇటీవల కాలంలో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రపంచ క్రికెట్లో మూడు ఫార్మాట్లలోనూ అత్యంత నిలకడగా రాణిస్తున్నవిరాట్ కోహ్లీ ఇటీవల ఓ మీడియా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఈ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ.. 'యూత్ ఐకాన్'గా ఉండటం అంత సులువు కాదంటున్నాడు కోహ్లీ. ఈ భారం మోయటం చాలా కష్టమని అంటున్నాడు. యువతకు రోల్ మోడల్గా ఉన్నప్పుడు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు.
'ఆదర్శ వ్యక్తిగా ఉన్నప్పుడు ప్రయాణం అంత సాఫీగా ఉండదు. మైదానంలో, బయట మన ప్రవర్తనను ఫ్యాన్స్ నిశితంగా గమనిస్తుంటారు. అయితే చిన్న వయసులోనే యువతకు రోల్ మోడల్గా ఉండటం గౌరవంగా భావిస్తున్నా. ఈ అనుభూతి గొప్పగా ఉంటుంది' అని కోహ్లీ తెలిపాడు.
అంతేగాక, 'ప్రజలు మనల్ని చూడాలని ఆరాటపడటం, మనల్ని స్ఫూర్తిగా తీసుకోవడం సంతోషంగా అనిపిస్తుంది. ఇక యూత ఐకాన్గా ఉన్నప్పుడు మనం చేసే పనులు నేరుగా యువతపై ప్రభావం చూపుతాయి' అని కోహ్లీ పేర్కొన్నాడు.
విజయానికి దగ్గరి దారులుండవు
సక్సెస్కు దగ్గరి దారిలేవీ ఉండవని కోహ్లీ స్పష్టం చేశాడు. 'నా సక్సెస్ స్టోరీ గురించి చాలా మంది అడుగుతుంటారు. కెరీర్ విజయవంతం కావడానికి చేసిన కృషి గురించి తెలుసుకోవాలని ఆసక్తి ప్రదర్శిస్తారు. నా వరకు క్రమశిక్షణ పాటించడం, కఠోర శ్రమ చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం' అని కోహ్లీ పేర్కొన్నాడు.
తాను నిరంతరం నేర్చుకోవడాన్ని ఇష్టపడతానని తెలిపాడు. గతంలో చేసిన తప్పులను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ.. వాటిని పునరావృతం కాకుండా చూసుకుంటానని తెలిపాడు. నిత్య విద్యార్థిగా ఉంటేనే కెరీర్లో ఎదుగుదల ఉంటుందని భావిస్తానని చెప్పాడు. వీటన్నింటినీ త అభిమానులు కూడా పాటించాలని కోరుకుంటానని కోహ్లీ చెప్పాడు.
'మైదానంలో ప్రతి మ్యాచ్లోనూ అభిమానులు నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. నేను కూడా సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తూ ఉంటా. అందుకే 'ఫ్యాన్స్బాక్స్' అనే యాప్ ద్వారా అభిమానులకు మరింత చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నా' అని కోహ్లీ పేర్కొన్నాడు. ప్రస్తుతం కోచ్ అనిల్ కుంబ్లే నేతృత్వంలో వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతోంది విరాట్ సేన