పూణె: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్లోనే కాదు మైదానంలో కూడా దూకుడుగా ఉంటాడు. బ్యాట్తో బౌలర్లకు చుక్కలు చూపించే విరాట్ కోహ్లీ ప్రత్యర్ధులు నోరు జారితే అంతే ధీటుగా సమాధానం చెప్తాడు. ఈ విధంగా ప్రవర్తించే పలు మార్లు విమర్శలు పాలయ్యాడు.
అయితే విరాట్ కోహ్లీలో చాలా మందికి తెలియని మరో పార్శ్యం ఉంది. కోహ్లీ వ్యక్తిగత జీవితంలో ఎంతో నిబ్బరంగా, సేవాభావంతో ప్రవర్తిస్తాడంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రస్తుతం ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా కోహ్లీ ఇటీవల పుణెలో 'అబహల్మాయ' అనే వృద్ధాశ్రమాన్ని సందర్శించాడు.
అక్కడ పెద్దలతో ఎంతో అప్యాయంగా మాట్లాడి వారి క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నాడు. పుణెలో ఆడిన ఐపీఎల్ మ్యాచ్లో తనకు వచ్చే ఫీజులో 50 శాతాన్ని ఆ సంస్థకు విరాళంగా ప్రకటించి తన సేవా హృదయాన్ని చాటుకున్నాడు.
దీంతో పాటు విరాట్ కోహ్లీ ఫౌండేషన్ తరుపున ఆ సంస్థకు మరింత సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. కుటుంబ పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడం మనందరి బాధ్యత అని ఈ సంస్ధ ఫౌండర్ డాక్టర్ అపర్ణా దేశ్ముఖ్ మంచి పని చేస్తున్నారని ఆమె సేవలను కొనియాడారు.
పెద్దవాళ్ల బాగోగులు చూడకుండా వదిలివేయడం తప్పని ఈ సందర్భంగా కోహ్లీ ఉద్వేగంగా చెప్పాడు. కాగా బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో కోల్కత్తా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లికి రూ. 24 లక్షలు జరిమానా విధించిన సంగతి తెలిసిందే.