రెండు మ్యాచ్ల వన్డే సిరిస్కు స్టోక్స్ దూరం
ఐపీఎల్ లీగ్ కోసం స్టోక్స్ ఐర్లాండ్తో మే 5, 7వ తేదీల్లో జరిగే రెండు మ్యాచ్ల వన్డే సిరిస్కు దూరమయ్యాడు. దీంతో ఐపీఎల్ 10వ సీజన్ వేలంలో అత్యధిక ధర పలికిన బెన్ స్టోక్స్ అందులో కొంత మొత్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిబంధనల ప్రకారం కౌంటీలతో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు ఆ జట్టు మ్యాచ్లలో పాల్గొనకపోతే నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
లక్ష పౌండ్లు కోల్పోనున్న బెన్ స్టోక్స్
దీని ప్రకారం అతని కాంట్రాక్ట్ మొత్తంలో నుంచి ఒక్కో రోజుకు 0.5 శాతం (సుమారు 3,500 పౌండ్లు) చొప్పున కోత విధిస్తారు. దీని ప్రకారం ఐపీఎల్లో బెన్ స్టోక్స్ ఆడినన్ని రోజుల ప్రకారం డబ్బు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. స్టోక్స్ భారత్లో ఉండేందుకు అవకాశం ఉన్న 28 రోజులకు ఈ మొత్తం దాదాపు లక్ష పౌండ్లు (రూ. 84 లక్షలు) అవుతుంది.
తైమాల్ మిల్స్కు ఆ సమస్య లేదు
మరోవైపు ఇదే వేలంలో స్టోక్స్ తర్వాత అత్యధిక ధర పలికిన ఇంగ్లాండ్ టీ20 స్పెషలిస్ట్ క్రికెటర్ తైమాల్ మిల్స్ అన్ని ఫార్మాట్లలో ఆడే కాంట్రాక్ట్ ఉన్న ఆటగాడు కాకపోవడంతో అతనికి ఈ సమస్య లేదు. వేలంలో తైమాల్ మిల్స్ను రూ. 12 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
అన్ని లీగ్ మ్యాచ్లు ఆడనున్న జోస్ బట్లర్, క్రిస్ వోక్స్
ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ ప్లేయర్ జోస్ బట్లర్, కోల్కతా నైట్రైడర్స్ క్రికెటర్ క్రిస్ వోక్స్ కూడా అన్ని లీగ్ మ్యాచ్లూ ఆడనున్నారు. మే 14 తర్వాతే వీరు స్వదేశం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా, పంజాబ్ కొనుగోలు చేసిన ఇయాన్ మోర్గాన్, గుజరాత్కు చెందిన జాసన్ రాయ్, ఢిల్లీ క్రికెటర్ శామ్ బిల్లింగ్స్లు ఏప్రిల్లో జరిగే మ్యాచ్లు ముగిసిన తర్వాతే తమ ఫ్రాంచైజీ జట్లతో కలవనున్నారు.