హైదరాబాద్: క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ నిర్వహించిన మూడు రోజుల టోర్నమెంట్లో బారిషా క్లబ్ ఆటగాడు పంకజ్ షా విధ్వంసకర బ్యాటింగ్తో రికార్డు సృష్టించాడు. దక్షిణ్ కాలికటా సంసాద్తో జరిగిన మ్యాచ్లో తన విశ్వరూపాన్ని చూపించాడు. 413 పరుగుల (289 బంతుల్లో)తో నాటౌట్గా నిలిచి చరిత్ర సృష్టించాడు.
ఆదివారం 44 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన 28 ఏళ్ల పంకజ్ షా 400 పరుగుల మార్కును చేరుకునే క్రమంలో 44 ఫోర్లు, 23 సిక్సులతో అజేయంగా నిలిచాడు. బౌండరీలు, సిక్సులతో పరుగుల వరద పారించాడు. ఈ టోర్నీలో నాలుగు వందలకు పైగా వ్యక్తిగత పరుగులను సాధించి అందరినీ ఆశ్చర్య పరిచాడు.
ఆరో వికెట్కు అజ్మీర్ సింగ్ (47)తో కలిసి 203 రన్స్ చేయడంతోపాటు, ఎనిమిదో వికెట్కు శ్రేయన్ చక్రవర్తి (22)తో 191 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 192/2 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన బారిషా జట్టు
పంకజ్ షా రాణించడంతో 115 ఓవర్లలో 708/8 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.
అనంతరం ఇన్నింగ్స్ను ప్రారంభించిన దక్షిణ్ కాలికటా సంసాద్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 114.1 ఓవర్లలో 369 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో 96/2తో నిలవడంతో బరిషా జట్టుకు నాలుగు పాయింట్లు, దక్షిణ కాలికటా సంసాద్ జట్టుకు రెండు పాయింట్లు దక్కాయి.
ఇదిలా ఉంటే గత సీజన్లో రాజస్ధాన్తో మ్యాచ్ సందర్బంగా రంజీల్లో అరంగేట్రం చేసిన పంకజ్ షా బెంగాల్ తరపున ఇప్పటివరకూ 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 12 టీ20లు, నాలుగు లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడాడు. అంతక ముందు బెంగాల్ అండర్-19, అండర్-22 జట్ల తరఫున కూడా షా ఆడాడు.
పంకజ్ షా ఈస్ట్రన్ రైల్వేస్లో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్ డి ఉద్యోగిగా ఉన్న పంకజ్ షా రైలు కంపార్ట్మెంట్లోని పాంటోగ్రాఫ్ను రిపేర్ చేసేవాడు. నిజం చెప్పాలంటే ఇది చాలా ప్రమాదంతో కూడుకున్న ఉద్యోగం. అయినప్పటికీ తన కుటుంబ పోషణ కోసం పంకజ్ షా ఈ ఉద్యోగం చేసేవాడు.
తనలోని ఆటను గమనించిన మాజీ బెంగాల్ క్రికెటర్ ఉదయ్ భాను బెనర్జీ... పంకజ్ షాకు క్రికెట్ పాఠాలు నేర్పాడు. క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సూచన మేరకు తన ఉద్యోగానికి రాజీమానా కూడా చేశాడు.