హైదరాబాద్: దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే వన్డే ట్రోఫీలో భాగంగా ఛత్తీస్గఢ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ సాధించి జార్ఖండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై మహమ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు.
మూడు ఫార్మెట్లలో ఆడే సత్తా ధోనికి ఇంకా ఉందని, ఈడెన్ గార్డెన్స్లో ధోని ఇన్నింగ్సే ఇందుకు నిదర్శమని కైఫ్ ప్రశంసలు కురిపించాడు. 'ధోని సహజసిద్ధమైన పవర్ ఏమిటో మరొకసారి చూశాం. అతను ఇంకా అన్ని ఫార్మాట్లలో ప్రమాదకర ఆటగాడని నేను బలంగా నమ్ముతున్నా. బంతిని ధోని హిట్ చేసే విధానాన్ని బట్టి చూస్తే తన పవర్ ఇంకా అలాగే ఉంది' అని కైఫ్ అన్నాడు.
ఈడెన్లో ధోని మెరుపు ఇన్నింగ్స్: ఛత్తీస్గఢ్పై విజయం
'ధోని అరంగేట్రం మ్యాచ్ నుంచి అతన్ని నేను చూస్తునే ఉన్నా. అప్పటికీ, ఇప్పటికీ అతని ఆట తీరులో ఎటువంటి మార్పు లేదు. ధోని ఏదో ప్రాక్టీస్ కోసమే ఈ టోర్నీలు ఆడుతున్నాడని మనం అనుకుంటే పొరపాటే. అతను ప్రతీ గేమ్ను చాలా సీరియస్గా తీసుకుంటాడు' అని కైఫ్ అన్నాడు.
విజయ్ హాజారే టోర్నీలో భాగంగా జార్ఖండ్ తరుపున బరిలోకి దిగిన ధోని 107 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సులతో 129 పరుగులతో సెంచరీని నమోదు చేశాడు. దీంతో గ్రూప్ 'డి'లో జరిగిన మ్యాచ్లో ఛత్తీస్గఢ్పై 78 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జార్ఖండ్ 14.4 ఓవర్లలో 43 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో బ్యాటింగ్కు దిగిన ధోని తనదైన శైలిలో విజృంభించాడు. షాబాజ్ నదీమ్ (53)తో కలిసి ఏడో వికెట్కు ధోని 151 పరుగులు జోడించాడు.
ఆఫ్ స్పిన్నర్ సాహిల్ గుప్తా వేసిన ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో ధోని 23 పరుగులు రాబట్టడం విశేషం. 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షార్ట్ ఎక్స్ట్రా కవర్లో కైఫ్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కెప్టెన్ ఆ వెంటనే లిస్ట్ 'ఎ' క్రికెట్లో 17వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విజయ్ హాజారే ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకు తొలిసారిగా ధోని కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.