హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా లీగ్ దశలో జరిగిన చివరి మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మెరుపులు మెరిపించాడు. కోరీ ఆండర్సన్ బౌలింగ్లో కోహ్లీ కొట్టిన షాట్ అద్భుతమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో కోరీ అండర్సన్ బౌలింగ్లో కోహ్లీ సొగసైన సిక్సర్ బాదాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆడుతున్న కోహ్లీ ఓ చిత్రమైన షాట్ కొట్టాడు. ఇద్దరు ఫీల్డర్ల మధ్య నుంచి ఏదో చిన్న షాట్ కొట్టినట్లుగా కొడితే, అది కాస్తా ఏకంగా 67 మీటర్ల దూరం వరకు గాల్లోనే ప్రయాణించి ఎక్స్ట్రా కవర్ దిశగా వెళ్లి బౌండరీ అవతల ఢిల్లీ డగౌట్లో పడింది.
ఆ షాట్ ఆడిన తర్వాత కోహ్లీ ఎందుకో నవ్వుకున్నాడు. ఆ నవ్వు ఎందుకో మ్యాచ్ అయిపోయిన తర్వాత తెలిసింది. వాస్తవానికి తాను ఫీల్డర్ల మధ్య నుంచి బాల్ కొట్టి, రెండు పరుగులు తీయాలని అనుకున్నానని, కానీ కోరీ క్రాస్-సీమ్ బాల్ వేయడంతో తాను సంతోషంగా దాన్ని కొట్టానని, అనుకోకుండా అది సిక్స్ వెళ్లిపోయిందని కోహ్లీ మ్యాచ్ అయిపోయాక ప్రజంటేషన్ సమయంలో చెప్పాడు.
కాగా, ఈ మ్యాచ్లో కోహ్లీ 45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఆలస్యంగా జట్టులో చేరిన విరాట్ కోహ్లీ నాలుగే అర్ధసెంచరీలు చేశాడు. నాలుగు అర్ధశతకాలతో కేవలం 308 పరుగులు చేశాడు. గత సీజన్లో 11 సార్లు 50కి పైగా పరుగులు చేసిన కోహ్లీ ఈ సీజన్ ప్రారంభంలో భుజానికి గాయం వల్ల కొన్ని మ్యాచ్లు ఆడలేకపోయాడు.