హైదరాబాద్: టీమిండియాకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) షాకిచ్చింది. క్రికెటర్లు ఏ ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉద్యోగం చేయకూడదంటూ కోహ్లీసేనకు బీసీసీఐ నోటీసులు పంపించింది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు రాజీనామా చేయాలని సూచించింది.
బీసీసీఐ తాజా నిర్ణయంతో భారత జట్టులోని పలువురు క్రికెటర్లు ఉద్యోగాలు కోల్పోనున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు శిఖర్ ధావన్, అజ్యింకే రహానే, ఇషాంత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా, గౌతం గంభీర్లు ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉద్యోగులుగా ఉన్నారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓఎన్జీసీలో మేనేజర్గా ఉన్నారు. గతంలో ఓఎన్జీసీ నిర్వహించిన అనేక స్ధానిక టోర్నీల్లో కోహ్లీ ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఢిల్లీకి చెందిన పలువురు క్రికెటర్లకి ఓఎన్జీసీ ఉద్యోగ అవకాశాలు కల్పించింది.
వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ లాంటి క్రికెటర్లు ఓఎన్జీసీలో గౌరవ ప్రదమైన స్ధానాల్లో ఉన్నారు. సుప్రీం కోర్టు నియమించిన పరిపాలనా కమిటీ సూచన మేరకే బీసీసీఐ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.