న్యూఢిల్లీ: వెస్టిండీస్ సిరీస్ టీమిండియాకు పెద్ద సవాల్ కాదని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఢిల్లీలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. టీమిండియాకు కుంబ్లే అద్భుతమైన కోచ్ అని కొనియాడాడు.
టెస్టుల్లో సెంచరీతో పాటు 600కుపైగా వికెట్లు తీసిన ఆటగాడిగా కుంబ్లేపై అంతులేని అభిమానం ఉందని తెలిపాడు. కుంబ్లే సానుకూల స్వభావం కలిగిన వ్యక్తి అని సెహ్వాగ్ తెలిపాడు.
కుంబ్లేది ఓటమిని అంగీకరించే తత్వం కాదని చెప్పాడు. అతని నుంచి టీమిండియా యువ ఆటగాళ్లు విలువైన విషయాలు నేర్చుకునే అవకాశం ఉందని అన్నాడు. అతని నేతృత్వంలో టీమిండియా అత్యధిక విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
అయితే కుంబ్లేకు అసలు సవాల్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్లలో ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా టీమిండియాకు కోచ్గా చేసే అవకాశం వచ్చినా చేసేంత తీరిక తనకు లేదని సెహ్వాగ్ తెలిపాడు.
అంతేగాక, టీమిండియాకు బ్యాటింగ్ కోచ్ అవసరం లేదని స్పష్టం చేశాడు. కోహ్లీ లాంటి ప్రతిభ గల ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారని తెలిపారు. కుంబ్లే నేతృత్వంలో టీమిండియా విజయావకాశాలు మెరుగవుతాయని మరోసారి స్పష్టం చేశాడు.