హైదరాబాద్: నాలుగు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1తేడాతో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాను అభినందిస్తూ భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో రహానే నేతృత్వంలోని టీమిండియా ఆసీస్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
దీంతో స్వదేశంలో వరుసగా ఏడు టెస్టు సిరిస్లను టీమిండియా కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా బీసీసీఐ భారత ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల నజరానా ప్రకటించింది. టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేకు రూ.25 లక్షల రివార్డు, సపోర్టింగ్ స్టాఫ్కి రూ.15 లక్షలు అందజేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ సీజన్ను టీమిండియా నెంబర్ వన్ ర్యాంకుతో ముగించింది. ఈ విజయానికి గుర్తుగా టీమిండియాలో ఉత్సాహం నింపేందుకు ఆటగాళ్లతో పాటు కోచ్, సిబ్బందికి బీసీసీఐ వారికి భారీ నజరానా ప్రకటించింది. స్వదేశంలో 2015 నుంచి భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సీజన్లో స్వదేశంలో 25 టెస్టులు ఆడిన టీమిండియా ఏకంగా 21 విజయాలు నమోదు చేసింది.
ఇందులో రెండు టెస్టుల్లో ఓటమి పాలవ్వగా, మరో టెస్టులను డ్రాగా ముగించింది. ఇక టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక సీజన్లో 82 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. చివరి టెస్టులో 106 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 23.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
తొలి ఇన్నింగ్స్లో అర్ధసెంచరీ చేసిన కేఎల్ రాహుల్, రెండో ఇన్నింగ్స్లో కూడా మరో అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ రాహుల్ 52, రహానే 38 పరుగులతో నాటౌట్గా నిలిచారు. నాలుగో రోజు ఉదయం ఓపెనర్ విజయ్ (8), పుజారా(0) ఒకే ఓవర్లో అవుట్ కావడంతో భారత అభిమానులు కాస్త ఆందోళన చెందారు.
అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీలతో చెలరేగాడు. కమిన్స్ బౌలింగ్లో రహానే వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. వేగంగా పరుగులు రావడంతో భారత్పై ఒత్తిడి తొలగింది. తొలి ఇన్నింగ్స్లో సాహాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన జడేజా రెండో ఇన్నింగ్స్లో కూడా ఆసీస్ పతనంలోనూ తన వంతు పాత్ర పోషించాడు.
ఇక ఈ సిరిస్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆరు అర్ధ సెంచరీలతో చెలరేగాడు. నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పూణెలో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలై 0-1తో భారత్ వెనుకబడినా ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న తీరు అద్భుతం. బెంగుళూరులో టెస్టులో విజయం సాధించి సిరిస్ను 1-1తో డ్రా చేసుకుంది.
ఆ తర్వాత రాంచీలో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో ధర్మశాల టెస్టు నిర్ణయాత్మకంగా మారింది. చివరి టెస్టుకు కెప్టెన్ కోహ్లీ దూరమైనా జట్టు ఏమాత్రం ఆందోళన చెందలేదు. తాత్కాలిక కెప్టెన్ రహానే స్ఫూర్తిదాయక కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. ఇక కోహ్లీ స్థానంలో 33వ టెస్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన రహానే తొలి విజయాన్ని అందుకున్నాడు.