హైదరాబాద్: బీసీసీఐ విషయంలో తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సిందిగా సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. లోధా కమిటీ సిఫారసుల అమలు విషయంలో బీసీసీఐకి కేంద్రం బాసటగా నిలిచింది. అధ్యక్ష కార్యదర్శుల తొలగింపుపై సుప్రీం తీర్పుని పునరాలోచించాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టును కోరారు.
బీసీసీఐ ప్రైవేటు సంస్థే అయినా పాక్షికంగా ప్రభుత్వానికీ సంబంధం ఉంటుందని ఈ సందర్భంగా రోహత్గీ కోర్టుకు వివరించారు. బీసీసీఐలో శాశ్వత సభ్యత్వం కోల్పోయి అసోసియేట్ సభ్యులుగా మారిన రైల్వేస్, విశ్వవిద్యాలయాల సంఘం, సర్వీసెస్ వాదనను పరిగణలోకి తీసుకొంటామని ధర్మాసంలోని న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.
చాలా సమస్యలకు ఇంకా పరిష్కారాలు దొరకలేదని, జులై 18 తీర్పును ఉపసంహరించుకోవాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. దీంతో లోధా కమిటీ సిఫారసుల అమలుపై గతంలో ఇచ్చిన తీర్పులో మార్పులు చేర్పులు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసింది.
జులై 18 తీర్పు ప్రకారం రాష్ట్ర సంఘం, బీసీసీఐలో కలిపి మొత్తం తొమ్మిదేళ్లు పదవుల్లో ఉంటే భవిష్యత్తులో ఎలాంటి పదవులు చేపట్టరాదు. అయితే శుక్రవారం సుప్రీం కోర్టు చేసిన మార్పుల ప్రకారం ఇకపై రాష్ట్ర సంఘాల్లో తొమ్మిదేళ్లు, బీసీసీఐలో తొమ్మిదేళ్లు పదవుల్లో ఉండొచ్చు.
మరోవైపు బీసీసీఐ కొత్త పాలకుల కోసం అమికస్ క్యూరీలు (కోర్టు సహాయకులు) అనిల్ దివాన్, గోపాల్ సుబ్రమణియన్లను కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం తొమ్మిది మంది పేర్లతో ఓ జాబితాను కోర్టుకు వాళ్లు అందజేశారు. అయితే ఈ జాబితా పెద్దగా ఉందన్న కారణంగా సుప్రీం కోర్టు దీనిని నిరాకరించింది.
తొమ్మిది మంది అంటే చాలా ఎక్కువని కొందరి పేర్లు తొలగించేంత వరకు అందరి పేర్లను రహస్యంగా ఉంచనున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ జాబితాను కూడా పరిగణలోకి తీసుకొని జనవరి 24 (బుధవారం)లోగా కమిటీ సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి? ఎలా ఉండాలన్న దానిపై తమ తీర్పు వెల్లడిస్తామని కోర్టు చెప్పింది.