హైదరాబాద్: వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ అభిమానులు అంతలా ఆసక్తిని కనబరిచే టోర్నీ ఛాంపియన్స్ టోర్నీ. ఇంగ్లాండ్లో జూన్ 1 నుంచి 18 వరకు జరిగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అభిమానులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన అన్ని వార్తల కోసం
ఇంగ్లాండ్ అండే వేల్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఎనిమిది మ్యాచ్లకు సంబంధించిన టికెట్లను ఐసీసీ అందుబాటులో ఉంచగా.. హాట్కేక్లా అమ్ముడుపోయాయి. గత వారంలో 15వేలకు పైగా టికెట్లను అభిమానులు కొనుగోలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
గత సెప్టెంబరులో ఈ టోర్నీ కోసం బాలెట్ ప్రారంభించినప్పటి నుంచి టికెట్లు కోరుతూ 60 దేశాల నుంచి దాదాపు 5 లక్షలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. అయితే స్థానిక అభిమానుల కోసం జూన్ 6న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్కి సంబంధించి కొన్ని టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది. టీమిండియా తలపడే అన్ని మ్యాచ్ల టికెట్లకి విపరీతమైన డిమాండ్ ఉందంట. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా జూన్ 4వ తేదీన పాకిస్థాన్తో ఆడే మ్యాచ్కి సంబంధించి అన్ని తరగతుల టికెట్లు నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోయాయి.
ఈ మేరకు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహకులు ప్రకటించారు. ఛాంపియన్స్కి ఇంగ్లాండ్లోని మూడు వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి. అందులో జూన్ 18న ఓవల్ మైదానంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడైనట్లు నిర్వహకులు తెలిపారు.
వన్డే ర్యాంకింగ్స్లో సెప్టెంబరు 30, 2015నాటికి టాప్ 8లో ఉన్న జట్లు మాత్రమే ఈ టోర్నీలో తలపడుతున్నాయి. టోర్నీలో భాగంగా మొత్తం 15 మ్యాచ్లు జరగనున్నాయి. 'ఛాంపియన్స్ ట్రోఫీకి అభిమానుల నుంచి స్పందన చాలా బాగుంది. ఇంకా కొన్ని మ్యాచ్ల టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అధికారిక వెబ్సైట్స్ ద్వారానే టికెట్లు కొనుగోలు చేయండి' అని టోర్నమెంట్ డైరెక్టర్ స్టీవ్ ఎల్వోర్తి సూచించారు.