హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో చిన్న చిన్న పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఆడితేనే ముందుకు వెళతామని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్లొనేందుకు ఇంగ్లాండ్కు చేరుకున్న న్యూజిలాండ్ కెప్టెన్ శుక్రవారం మీడియాతో మాట్లాడాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఛాంపియన్స్ ట్రోఫీలో తప్పిదాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని, అయితే ఎంత వరకు సక్సెస్ అవుతామనే దానిపై కచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నాడు.
ఈ టోర్నీలో అనుభవం కూడా ప్రత్యర్ధి జట్లపై కీలకపాత్ర పోషిస్తుందని చెప్పాడు. 'ఈ కాంపిటేషన్ లో ప్రతీ మ్యాచ్ కీలకం. మ్యాచ్ లు గెలుస్తూ ఉంటే ముందుకు వెళతాం. ఇక్కడ పరిస్థితులు మాకు కలిసొచ్చే అవకాశం ఉంది. అయితే అది కూడా కొంతవరకూ మాత్రమే' అని అన్నాడు.
'ప్రతీది మనకు అనుకూలంగా ఉండాలంటే ప్రత్యర్థులపై తిరుగులేని విజయాల్ని సొంతం చేసుకోవాలి. ఇక్కడ తేరుకోవడానికి సమయం ఉండదు. గెలుపే లక్ష్యంగా దూసుకుపోవాలి. వివిధ వాతావరణ పరిస్థితులతో పాట, పలు జట్లపై ఆడిన అనుభవం మాకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా' అని విలియమ్సన్ అన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తన తొలి మ్యాచ్లో భాగంగా జూన్ 2వ తేదీన ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఎడ్జిబాస్టన్ వేదికగా జరగనుంది. ఆ తర్వాత నాలుగు రోజులకి ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్తో కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ ఆడనుంది.