హైదరాబాద్: ఐపీఎల్లో కోహ్లీ ప్రదర్శనను చూసి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తక్కువ అంచనా వేయోద్దంటూ ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్మెన్ మైక్ హస్సీ ప్రత్యర్థి జట్లను హెచ్చరించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
'కోహ్లీ క్లాస్ ప్లేయర్. ఐపీఎల్లో అతడు విఫలమైన మాట వాస్తవమే. కానీ అది ఆ టోర్నీకి మాత్రమే పరిమితమని గుర్తుంచుకోవాలి. ఎవరైనా అతడిని లైట్గా తీసుకుంటే చేదు అనుభవం ఎదురుకాకతప్పదు. మేటి ఆటగాడు సుదీర్ఘకాలం ఫామ్లేమిని ఎదుర్కోడు. ఇంగ్లాండ్లో అతడు పట్టుదలగా ఆడి తాను ప్రపంచ స్థాయి ఆటగాడినని నిరూపించుకుంటాడు' అని శుక్రవారం ఓ ఐసీసీ కార్యక్రమంలో హస్సీ అన్నాడు.
'కోహ్లీ ఫామ్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత్ అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపదు. కోహ్లీ లాంటి బ్యాట్స్ మెన్ను ఎక్కువ రోజులు కట్టడి చేయడం ఏ బౌలర్కు సాధ్యపడదని గుర్తుంచుకోవాలి. ఐపీఎల్ వైఫల్యంతో ఉన్న కోహ్లీ చాంపియన్స్ ట్రోఫీలో అద్బుతాలు సృష్టిస్తాడు. కానీ ఇంగ్లాండ్లో ఆడాలంటే నిలకడ కొనసాగించాలి. అప్పుడే పరుగులు రాబట్టడం సులువు' అని పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నాడు. ఇంగ్లాండ్ పరిస్థితులకు కూడా క్రికెటర్లు అలవాటుపడాలని సూచించాడు. ఆస్ట్రేలియాలో మాదిరి బంతులు వేగంగా బ్యాట్పైకి దూసుకురావని, అందువల్ల బంతి వచ్చేవరకూ ఎదురు చూసి ఆడడం ఇంగ్లండ్లో ముఖ్యమని పేర్కొన్నాడు.
బర్మింగ్హామ్, కార్డిఫ్, ఓవల్ పిచ్లు స్పిన్నర్లకు కొత అనుకూలిస్తాయని హస్సీ తెలిపాడు. పిచ్లు పొడిగా ఉంటే మాత్రం స్పిన్నర్లు హవా సాగిస్తారని అంచనా వేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీని స్టీవ్ స్మిత్ సేన గెలిచే అవకాశాలున్నాయని చెప్పాడు. ఇక ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఫామ్ కొనసాగించడం జట్టుకు కలిసొచ్చే అంశమని తెలిపాడు.
ఫైనల్లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ వన్డేల యాషెస్ యుద్ధంగా అంచనా వేస్తున్న హస్సీ, భారత్-ఆస్ట్రేలియా కూడా తలపడే అవకాశాలూ లేకపోలేదన్నాడు.