హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ది ఓవల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్పై పాకిస్థాన్ 180 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: భారత ఓటమికి ప్రధాన కారణం
పాక్ చేతిలో భారత్ ఓటమి నేపథ్యంలో భారత్లో క్రికెట్ అభిమానులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్లో భారత ఆటగాళ్లు కనీసం పోరాడకుండా ఓటమి పాలవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో భారత్లో పలు చోట్ల టీవీలను పగలగొట్టడంతో పాటు, క్రీడాకారుల దిష్టిబొమ్మలను సైతం దగ్ధం చేశారు.
ఈ నేఫథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా జార్ఖండ్ ప్రభుత్వం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నివాసానికి భారీ భద్రతను కల్పించింది. 2014లో టీమిండియా ఓటమి పాలైన సమయంలో ఆందోళనకారులు ధోనీ నివాసం వద్ద వీరంగం సృష్టించారు.
ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని జార్ఖండ్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓటమిని తట్టుకోలేని క్రికెట్ అభిమానులు ధోని ఇంటి వద్ద వీరంగం సృష్టిస్తారేమోనని భావించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం వై కేటగిరి భద్రతా సిబ్బంది ధోని ఇంటి వద్ద భద్రతను పర్యవేక్షిస్తోంది. ఆదివారం ది ఓవల్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ధోని కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. హసన్ అలీ బౌలింగ్లో ఇమాద్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 30.3 ఓవర్లకు గాను 158 పరుగులు చేసిన ఆలౌటైంది.