హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగే రెండో సెమీ ఫైనల్లో టీమిండియాతో ఆడటం సంతోషంగా ఉందని, బంగ్లాదేశ్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఎంతో రిలాక్స్గా ఉందని ఆ జట్టు కోచ్ చండిక హతురుసిన్హా పేర్కొన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
భారత్తో జరిగే రెండో సెమీ పైనల్ మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన ద్వారా క్రికెట్ ప్రపంచానికి బంగ్లాదేశ్ సత్తా ఏంటో చూపించాలని తాము ఉవ్విళ్లూరుతున్నట్లు తెలిపాడు. టీమిండియాతో సెమీస్ మ్యాచ్ బుధవారం హతురుసిన్హా మీడియాతో మాట్లాడాడు.
2015 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా చేతిలో బంగ్లాదేశ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇరు దేశాలకు చెందిన అభిమానులు తీవ్ర విమర్శలకు సైతం దిగారు. అయితే ఆ మ్యాచ్లో భాగంగా భారత్పై ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం లేదని చెప్పాడు.
'ప్రతీకారం తీసుకునే ఉద్దేశం లేదు. భారత్తో జరిగే మ్యాచ్లో మంచి గేమ్ ఆడాలని అనుకుంటున్నాం. సెమీస్లో భారత్ నిస్సందేహంగా గెలిచే జట్టే. కానీ మా జట్టు సర్వశక్తులు ఒడ్డి పోరాడితే ఏ ప్రత్యర్థికైనా సవాల్ విసరగలదు. ఈ మ్యాచ్ కోసం మేము ఏమీ ప్రత్యేకంగా ప్రణాళికలు రచించడం లేదు' అని తెలిపాడు.
'ఇది కూడా సాధారణంగా జరిగే ఒక మ్యాచ్లాగే భావిస్తున్నాం. మా జట్టులో ప్రతిభ ఉన్న ఆటగాళ్లున్నారు. ఫలితం గురించి ఆలోచించకుండా స్వేచ్ఛగా చెలరేగిపోతాం. ఐసీసీ టోర్నీల్లో భారత్ చేతిలో మేము ఓడిపోయాం. కానీ.. ఇది ప్రతీకార పోరు మాత్రం కాదు' అని బంగ్లా కోచ్ అన్నాడు.
కాగా, గ్రూప్-ఎలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లని దురదృష్టం వెంటాడటంతో అనూహ్యంగా ఇంగ్లాండ్తో పాటు బంగ్లాదేశ్ సెమీస్ చేరిన సంగతి తెలిసిందే. గురువారం ఎడ్జిబాస్టన్ వేదికగా గ్రూప్-బిలో భారత్తో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది.