హైదరాబాద్: ఇప్పటికే టెస్టులతో పాటు పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన మహేంద్రసింగ్ ధోని, క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్మెంట్ తీసుకోనున్నాడా? అంటే అవుననే అంటున్నారు. క్రికెట్కు ధోని శాశ్వతంగా వీడ్కోలు చెబుతాడా లేదా అనేది మరో మూడునెలల్లో తేలిపోనుందట.
ఈ విషయాన్ని ధోని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ తెలిపారు. జూన్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ తర్వాతే ధోని తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవచ్చని కేశవ్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. 'ప్రస్తుతానికి ధోని దృష్టంతా ఆ టోర్నీపైనే ఉంది. అందులో బాగా ఆడగలిగితే 2019 వరల్డ్ కప్ వరకు కూడా కొనసాగవచ్చు' అని అన్నారు.
అండర్-14 క్రికెట్ టోర్నీ సందర్భంగా కేశవ్ బెనర్జీ మీడియాతో మాట్లాడారు. 'ధోని వయసు పెరిగింది కాబట్టి ఆటలో ధాటి తగ్గడం కూడా సహజం. అయితే ఎవరూ వేలెత్తి చూపక ముందే తన గురించి నిర్ణయం తీసుకోగలడు' అని ఆయన వ్యాఖ్యానించారు.
2014 చివర్లో అనూహ్యంగా టెస్టులకు గుడ్బై చెప్పిన ధోని, అదేరీతిలో ఈ ఏడాది జనవరిలో వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. దీనిపై బెనర్జీ మాట్లాడుతూ దిగిపోవాల్సిందిగా మరొకరితో చెప్పించుకోవడం ధోనీకి ఇష్టముండదు. మరొకరు తనను వేలెత్తి చూపకుండా ఉండేందుకే అప్పుడు అనూహ్యంగా టెస్టుల నుంచి తప్పుకున్నాడు అని వివరించారు.
అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ ఎడిషన్లో రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ జట్టు కెప్టెన్గా ధోనీని తప్పించిన తీరు తనను బాధించిందని ఆయన తెలిపారు.