హైదరాబాద్: పాకిస్థాన్ చీఫ్ కోచ్ మిక్కీ ఆర్ధర్ తనని అసభ్య పదజాలంతో దూషించాడని ఆ జట్టు వెటరన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ ఆరోపించాడు. ట్రైనింగ్ కోసం లాహోర్లోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నాడు.
అంతేకాదు ఈ ఘటన జరిగిన సమయంలో ఇంజిమామ్ ఉల్ హక్, ముస్తాక్ అలీలు కూడా అక్కడే ఉన్నారని ఉమర్ అక్మల్ పేర్కొన్నాడు. "ఈరోజు ఉదయం నేను మీడియాతో ఏదైతే చెప్పానో దానికి కట్టుబడి ఉన్నా. కోచ్ మిక్కీ ఆర్దర్ అసభ్య పదజాలంతో దూషించాడు. ఎన్సీఏలో జరిగిన ఘటనకు ఇంజిమామ్ ఉల్ హక్, ముస్తాక్ అలీలే సాక్ష్యం" అని పీటీఐతో అన్నాడు.
మోకాలి గాయానికి లండన్లో శస్త్ర చికిత్స చేయించుకున్న అక్మల్ మళ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేందుకు జాతీయ క్రికెట్ అకాడమీకి వచ్చాడు. అయితే కోచ్ అతడికి శిక్షణ ఇచ్చేందుకు నిరాకరించడంతో వివాదం మొదలైంది. పాక్ క్రికెట్ బోర్డుతో అక్మల్కి ప్రస్తుతం సెంట్రల్ కాంట్రాక్ట్ లేకపోవడంతోనే కోచ్, సహాయ సిబ్బంది అతడిని ప్రాక్టీస్కి అనుమతించలేదు.
'అకాడమీలో మొదట ఫిజియోని కలిశాను. అనంతరం సహాయ సిబ్బంది సూచన మేరకు కోచ్ మిక్కీ ఆర్థర్ని స్వయంగా అనుమతి కోసం కలిశాను. అతను మాత్రం.. తాను కేవలం కాంట్రాక్ట్లో ఉన్న ఆటగాళ్లకి మాత్రమే శిక్షణ ఇస్తానని నాకు చెప్పాడు' అని అన్నాడు.
'దీంతో చీఫ్ సెలక్టర్ ఇంజిమామ్, సహాయ కోచ్ ముస్తాక్లతో నేను మాట్లాడాను. వాళ్లు ఇటీవల నా ఆటతీరు గురించి చర్చించారు. నిజమే నేను గత కొన్ని ఫిటెనెస్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను. కానీ ఈ ఇద్దరూ నాకు మరో అవకాశం ఇచ్చే ఉద్దేశంలో వెళ్లి మిక్కీ ఆర్థర్తో మాట్లాడు' అని చెప్పారు.
'నేను రెండో సారి మిక్కీ ఆర్థర్ వద్దకు వెళ్లి విషయం చెప్పగా.. తను సహనం కోల్పోయి అసభ్య పదజాలంతో నన్ను దారుణంగా దూషించాడు' అని అక్మల్ మీడియాతో వివరించాడు. ఇదిలా ఉంటే బోర్డు అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడినందుకు అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు పీసీబీ సమాయత్తమవుతోంది.
ఈ మేరకు అక్మల్కు షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్టు సిద్ధమైనట్లు బోర్డు అధికారి ఒకరు తెలిపారు. "ప్రస్తుతం అతడు సెంట్రల్ కాంట్రాక్టులో లేడు. బోర్డు అనుమతి లేనిదే అతడు మీడియతో మాట్లాడకూడదు" అని తెలిపారు. ఈ మేరకు బోర్డు ట్వీట్ చేసింది.
Update: PCB to issue showcause notice to Umar Akmal.
— PCB Official (@TheRealPCB) 16 August 2017