హైదరాబాద్: పుట్బాల్లో దూకుడుగా ప్రవర్తిస్తే సదరు ఆటగాడిని మైదానం బయటకు పంపే హక్కు గ్రౌండ్లో ఉన్న అంఫైర్కు ఉన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇలాంటి రూల్సే ఇప్పుడు క్రికెట్లో కూడా రానున్నాయి. ఈ మేరకు క్రికెట్లో ఐసీసీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.
మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించి టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని 14 మంది సభ్యులతో కూడిన ఐసీసీ క్రికెట్ కమిటీ తాజా నిబంధనలపై చర్చించి ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సిఫార్సు చేసింది. ఈ కొత్త నిబంధనలకు ఆమోద వేసిన ఐసీసీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది.
కొత్త నిబంధనలతో మైదానంలో ఇకపై ఏ అటగాడైనా దూకుడుగా ప్రవర్తిస్తే అతడిని బయటకు పంపే అధికారం గ్రౌండ్లో ఉన్న అంఫైర్లకు ఉంటుంది. ఈ తరహా నిబంధనలను ఇప్పటికే ఫుట్బాల్లో అమలు చేస్తున్నారు. మ్యాచ్ జరిగే సమయంలో ఏ జట్టుకి సంబంధించిన ఆటగాడైనా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లపై దూకుడుగా ప్రవర్తించినా, వివాదాలకు తెరతీసినట్లు తేలినా మైదానంలో ఉండే అంపైర్లు పసుపు, ఎరుపు కార్డులతో సంకేతాలిచ్చి ఆటగాడిని ఆట మధ్యలో నుంచి బయటకు పంపిస్తారు.
దీంతో పాటు డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) పద్ధతి అమలులో కూడా ఐసీసీ కొన్ని మార్పులు చేసింది. ఇకపై డీఆర్ఎస్ పద్ధతి టీ20ల్లోనూ అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అంతేకాదు బ్యాట్స్మెన్ ఉపయోగించే బ్యాట్ ఆకృతిపై కూడా స్వల్ప మార్పులు సూచించింది.